Chandrababu: రజనీకాంత్‌పై వైకాపా విమర్శలు.. తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైకాపా నేతల విమర్శలను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

Updated : 01 May 2023 10:48 IST

అమరావతి: ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైకాపా నేతల విమర్శలను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

‘‘అన్న గారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైకాపా మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైకాపా నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు.

పలు అంశాలపై రజనీ కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైకాపా నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటి దురుసు గల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని