Congress: సీడబ్ల్యూసీ పునర్‌వ్యవస్థీకరణ.. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు!

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ  అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీని ప్రకటించింది. మొత్తం 84మందితో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం దక్కింది.

Updated : 20 Aug 2023 16:38 IST

దిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌(Congress) సంస్థాగతంగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీని పునర్‌వ్యవస్థీకరించింది. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్‌ సభ్యులుగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. 18 మందిని CWC శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇంఛార్జిలుగా, తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేర్కొంది. కాంగ్రెస్‌లో అసమ్మతి వర్గంగా పేరొందిన జీ23 నేతలైన శశిథరూర్‌, ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ వంటి నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. సచిన్‌ పైలట్‌తో పాటు దీపా దాస్‌ మున్షి, సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌లను కొత్తగా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు.

సీడబ్ల్యూసీ సభ్యులు వీళ్లే.. 

సీడబ్ల్యూసీ సభ్యులుగా మొత్తం 39మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, అధిర్‌ రంజన్‌ చౌధురి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మీరా కుమార్‌, దిగ్విజయ్‌ సింగ్‌, పి.చిదంబరం, తారిక్‌ అన్వర్‌, లాల్‌ తాన్హావాలా, ముకుల్‌ వాస్నిక్‌, ఆనంద్‌ శర్మ, అశోక్‌ చవాన్‌, అజయ్‌ మాకెన్‌, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్జా, గైఖంగం, ఎన్‌. రఘువీరారెడ్డి, శశిథరూర్‌, తమ్రాద్వాజ్‌ సాహు, అభిషేక్‌ మను సింఘ్వి, సల్మాన్‌ ఖుర్షిద్‌, జైరాం రమేశ్‌, జితేంద్ర సింగ్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా, సచిన్‌ పైలట్‌, దీపక్‌ బబారియా, జగదీశ్ ఠాకూర్‌, జి.ఎ.మీర్‌, అవినాశ్ పాండే, దీపా దాస్‌ మున్షి, మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవీయ, గౌరవ్‌ గొగొయి, సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, కమలేశ్వర్‌ పటేల్‌, కేసీ వేణుగోపాల్‌ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనవారు..

తెలుగు రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ జనరల్‌ సభ్యుల జాబితాలో ఏపీ నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఒక్కరికే ఛాన్స్‌ లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కింది. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్‌ రెడ్డిలను ఎంపిక చేశారు. గతేడాది అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ(CWC) స్థానంలో 47మందితో తాత్కాలికంగా స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ సీడబ్ల్యూసీని పునర్‌వ్యవస్థీకరిస్తూ ఆదివారం జాబితాను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని