Rajya Sabha: రాజ్యసభ వివాదంలో ఎంపీలపై చర్యలు తప్పవా?

రాజ్యసభలో నిబంధనలను ఉల్లంఘించి అతిగా ప్రవర్తించిన ప్రతిపక్ష సభ్యులపై చర్యలు 

Updated : 16 Aug 2021 12:55 IST

వెంకయ్యను కలిసిన ఏడుగురు కేంద్ర మంత్రులు

ఈనాడు, దిల్లీ: రాజ్యసభలో నిబంధనలను ఉల్లంఘించి అతిగా ప్రవర్తించిన ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఏడుగురు కేంద్ర మంత్రులు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 11న సభలో కనిపించినట్టుగా ప్రతిపక్ష సభ్యుల హింసాత్మక కార్యకలాపాలు ఇదివరకెన్నడూ చూడలేదని, బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని ఆదివారం ఉప రాష్ట్రపతికి మంత్రులు వినతిపత్రం సమర్పించారు. మార్షల్స్‌ను వారి విధులు నిర్వహించకుండా సభ్యులు అడ్డుకున్నారని కూడా ఫిర్యాదు చేశారు.

విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని కేంద్రమంత్రుల బృందానికి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. ఉప రాష్ట్రపతిని కలిసిన బృందంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, ప్రహ్లాద్‌ జోషి, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్‌ యాదవ్, అర్జున్‌రాం మేఘ్‌వాల్, మురళీధరన్‌ ఉన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ కూడా పాల్గొన్నారు. సంఘటన జరిగిన సమయంలో సభకు నేతృత్వం వహించిన ప్యానల్‌ వైస్‌ ఛైర్మన్‌ సస్మిత్‌పాత్రతోనూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమావేశమై నాటి ఘటనల గురించి ఆరా తీశారు. శనివారం పార్లమెంటుకు వెళ్లి నాటి వీడియో రికార్డింగు కూడా పరిశీలించారు. భవిష్యత్తులో మరెవరూ కట్టు తప్పకుండా బాధ్యులైన ఎంపీలపై గట్టి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెంకయ్యనాయుడు అన్వేషిస్తున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని