కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసే వరకు ఉద్యమం

టీఎస్‌ఎపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకు ఉద్యమిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు.

Published : 20 Mar 2023 03:00 IST

నేడు ‘మా నౌకరీలు మాగ్గావాలే’ దీక్షలు
ఎస్సీ మెర్చా సమావేశంలో బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఎపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకు ఉద్యమిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని, లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో భాజపా ఆధ్వర్యంలో దీక్ష చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు భాజపాతోనే సాధ్యమన్నారు. నిరుద్యోగులకు భాజపా అండగా ఉంటుందని, వాస్తవాలను పక్కదారి పట్టించేందుకే భారాస నాయకులు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్‌ ఆదివారం నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ గార్డెన్‌లో భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. కర్ణాటకలోని కోలార్‌ ఎంపీ మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య, జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, మాజీ మంత్రులు విజయరామారావు, సుద్దాల దేవయ్య, పార్టీ నేతలు బంగారు శ్రుతి, జి.మనోహర్‌ రెడ్డి, ఎస్‌.కుమార్‌, శంభునాథ్‌ తుండియా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు, సామాన్య ప్రజలపై అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దళితులకు సీఎం పదవి ఇస్తానని, మూడెకరాలిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న ప్రధాని మోదీ.. అభినవ అంబేడ్కర్‌ అని సంజయ్‌ అభివర్ణించారు. 3 కోట్ల మందికి పైగా ప్రజలకు ఇళ్ల నిర్మాణం, 13.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల్‌ ద్వారా 9.5 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు మోదీ ప్రభుత్వంలో సాధ్యమయ్యాయని.. లబ్ధిదారుల్లో సగానికి పైగా దళితులేనని ఆయన తెలిపారు. లాల్‌సింగ్‌ ఆర్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న సీఎం కేసీఆర్‌.. దళితుల రిజర్వేషన్‌కు నష్టం కలిగించేలా మాట్లాడారని విమర్శించారు. సీఎం ఏనాడూ అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతిలో పాల్గొన్న దాఖలాలు లేవని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని