సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాలి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2023 05:49 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై రేవంత్‌ డిమాండ్‌
కేటీఆర్‌ కనుసన్నల్లోనే సిట్‌ విచారణ సాగుతోందని ఆరోపణ

ఈనాడు, దిల్లీ: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో బ్యాంకు లావాదేవీలు తక్కువగా ఉన్నప్పటికీ, విదేశాల్లో హవాలా రూపంలో భారీగా సొమ్ములు చేతులు మారినందున ఏసీబీతోనూ విచారణ చేయించాలని కోరారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో రేవంత్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ అనేది స్వతంత్ర సంస్థ అని చెబుతున్న మంత్రి కేటీఆర్‌ ఏ మండలంలో ఎందరు పరీక్ష రాశారు, కటాఫ్‌ ఎంతనేది ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. సిట్‌ విచారణ ఆయన కనుసన్నల్లోనే సాగుతోందని ఆరోపించారు. విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం మంత్రికి ఎలా చేరిందని దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించిన తనతోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులిచ్చిన సిట్‌.. మంత్రి కేటీఆర్‌కు మాత్రం సమాచారం ఇస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనలో ఆర్థిక కోణంపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తుండగా ఆ సంస్థల డైరెక్టర్లు సమయం ఇవ్వడం లేదన్నారు. ఈ కేసులో ప్రభుత్వోద్యోగులు కూడా ఉన్నందున ఏసీబీ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. కేసు విచారణ అధికారులపై కేటీఆర్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏదైనా సంచలన ఘటన జరిగినపుడు, అందులో ప్రభుత్వ పెద్దలపాత్ర కనిపించినపుడు వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారిపట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ సిట్‌ను వేస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని