Nara Lokesh: పేదల ఆకలి కేకలు వింటే జగన్‌కు ఆనందం

‘‘ముఖ్యమంత్రి జగన్‌ ఓ రాక్షసుడు. ఆయనకు పేదల ఆకలి కేకలు వింటే ఆనందం. అందువల్లే అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, 6 లక్షల పింఛన్లలో కోత పెట్టి ఆనందం అనుభవిస్తున్నాడు’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 29 May 2023 06:07 IST

అందుకే పథకాల్లో కోత, పన్నుల భారం
‘సెంటు’ స్థలాల్లో రూ.7 వేల కోట్లు లూటీ
మహానాడులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజం

‘‘ముఖ్యమంత్రి జగన్‌ ఓ రాక్షసుడు. ఆయనకు పేదల ఆకలి కేకలు వింటే ఆనందం. అందువల్లే అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, 6 లక్షల పింఛన్లలో కోత పెట్టి ఆనందం అనుభవిస్తున్నాడు’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రూ.లక్ష కోట్ల ఆస్తులు, 5 విశాల ప్యాలెస్‌లు, సొంత పేపరు, ఛానల్‌, ఫ్యాక్టరీలు ఉండి.. రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకొనేవారు పేద అవుతారా? అని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు 8సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3సార్లు పెంచి ప్రజలను బాదుతున్నారని తెలిపారు. చెత్త పన్ను, మద్యం సీసాలనూ వదల్లేదని.. ఇక పీల్చే గాలి మీదా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు.

విద్యుత్తు బిల్లు, ఆర్టీసీ టికెట్లపై నీ బొమ్మ వేసుకునే దమ్ముందా?

‘ప్రచారం కోసం ప్రతి ఇంటికీ స్టిక్కర్‌ అతికించాలట. విద్యుత్తు బిల్లులు, ఆర్టీసీ టికెట్లు, పెట్రోలు, డీజిల్‌ బిల్లులపై నీ బొమ్మ వేసుకునే దమ్ముందా అని జగన్‌కు సవాల్‌ చేస్తున్నా. జగన్‌ అద్భుతమైన పెయింటింగ్‌ మాస్టారు. ఇళ్లు కట్టలేదు కానీ, చంద్రన్న కట్టిన ఇంటికి రంగులు వేసుకుంటున్నారు’ అని విమర్శించారు.

శాశ్వతంగా పేదలుగానే ఉంచాలనే కుట్ర

‘ఎన్నికల ముందు ప్రతీ పేదవారికీ ఇల్లు కడతానన్నారు. ఇప్పుడు సెంటు స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. సెంటు స్థలాల వెనుక పెద్ద కుంభకోణం ఉంది. రైతుల నుంచి వైకాపా నాయకులు చౌకగా భూములు కొని వాటిని ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్ముకున్నారు. ఇందులో రూ.7 వేల కోట్ల ప్రజా ధనం లూటీ చేశారు. అప్పు తెచ్చి ఇళ్లు కట్టుకుంటే.. జీవితాతం ఆ అప్పు తీరుస్తూ.. వారు పేదలుగానే ఉండాలనేది జగన్‌ కుట్ర’ అని లోకేశ్‌ ఆరోపించారు.

రాష్ట్రాన్నే పీక్కు తింటున్నా..

‘సొంత పార్టీ ఎమ్మెల్యేలకూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని జగన్‌.. నాలుగేళ్లకు ఓ ఎమ్మెల్యేకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇన్నేళ్లలో మీరేం పీకారని జనం అడుగుతున్నారని ఆ ఎమ్మెల్యే జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. జగన్‌ జవాబిస్తూ.. ప్రజావేదిక పీకా, పేదల ఇళ్లు పీకా, తెదేపా నాయకుల ఇళ్లు పీకా, ఇప్పుడు రాష్ట్రాన్నే పీక్కు తింటున్నానని చెప్పు అన్నాడట’ అని లోకేశ్‌ చెప్పుకొచ్చారు.

పాదయాత్రలో ప్రజా సమస్యలు చూశా..

‘సైకో పాలనలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ బాధితులే. నా పాదయాత్రలో ప్రజల సమస్యలు, వారి కన్నీటినీ చూశా. వాటన్నింటినీ అధ్యక్షుడికీ తెలియజేశా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రన్న తెచ్చిన పరిశ్రమలు ఒక వైపున చూశా, మరోవైపు పాపాల పెద్దిరెడ్డి రూ.10 వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్నీ చూశా. మంత్రాలయంలో ప్రజలు ఉపాధి కోసం పక్క జిల్లాలకు వలసెళ్లడం చూస్తే బాదేసింది. తిరిగొచ్చి బాబుగారిని కోరా.. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మీరు శంకుస్థాపన చేసిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేద్దామన్నా’ అని పేర్కొన్నారు.

యాత్రను అడ్డుకుంటామని తోక ముడిచారు

‘నా పాదయాత్ర అడ్డుకునేందుకు నా మైకు బండి లాక్కున్నారు. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని ముందే చెప్పా. పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకు అడ్డుకుంటామని ఛాలెంజ్‌లు చేశారు. పిల్లుల్లా తోకముడిచి పారిపోయారు. సైకోని తాడేపల్లిలో పెట్టి శాశ్వతంగా తాళాలు వేద్దాం’ అని కార్యకర్తలకు లోకేశ్‌ పిలుపునిచ్చారు.

నాడు ఎన్టీఆర్‌.. నేడు చంద్రన్న

‘తెలుగుజాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడక్షరాల పేరు ఎన్టీఆర్‌, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు రాజకీయ ఆర్థిక స్వాతంత్య్రం కల్పించింది, తెలుగోడి శక్తిని దిల్లీకి చూపించింది, సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్‌. పార్టీని పెట్టేందుకు చరిత్ర ఉండాలి. ఆ పార్టీని నడిపించేందుకు క్యాలిబర్‌ ఉండాలి. ఆ చరిత్ర ఉన్న వ్యక్తి ఎన్టీఆర్‌, క్యాలిబర్‌ ఉన్న వ్యక్తి మన చంద్రన్న. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టింది చంద్రన్న. హైటెక్‌ సిటీతో చరిత్ర సృష్టించి.. ఎన్నో సంస్థలను తీసుకువచ్చి అభివృద్ధిని చేసి చూపించింది చంద్రన్న. చంద్రన్న బీమా, పసుపు కుంకుమ, పండగ కానుకలు, పెళ్లి కానుక, చాలీచాలని రూ.200 పింఛనును రూ.2 వేలు చేసింది, అన్న క్యాంటీన్‌తో పేదవారికి అన్నం పెట్టింది మన చంద్రన్న’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని