సంఘాల నేతల్ని గుప్పిట్లో పెట్టుకొని ఉద్యోగుల నోట్లో మట్టికొడుతున్నారు

ఉద్యోగ సంఘాల నేతలను గుప్పిట్లో పెట్టుకొని ఉద్యోగుల నోట్లో జగన్‌ ప్రభుత్వం మట్టికొడుతోందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ధ్వజమెత్తారు.

Published : 08 Jun 2023 05:04 IST

రూ.ఏడు వేల కోట్ల బకాయిల్ని 2027 వరకు చెల్లిస్తామనడం సిగ్గుచేటు
తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలను గుప్పిట్లో పెట్టుకొని ఉద్యోగుల నోట్లో జగన్‌ ప్రభుత్వం మట్టికొడుతోందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ధ్వజమెత్తారు. మంత్రివర్గం సమావేశం నిర్ణయాలతో ఉద్యోగులకు సంబంధించిన 71 డిమాండ్లు పరిష్కారమయ్యాయంటున్న ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు..అవి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.ఏడు వేల కోట్ల పీఆర్సీ, డీఏ బకాయిల్ని ఏడాదికి నాలుగు విడతల్లో 2027 వరకు చెల్లిస్తామనడం సిగ్గుచేటన్నారు. అంటే ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే ప్రభుత్వం చెల్లించాలా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అంశం సీపీఎస్‌ రద్దు. దాన్ని పక్కదారి పట్టించి జీపీఎస్‌ విధానం అమలు చేస్తామని నిర్ణయం ఎలా తీసుకుంటారు? కాంట్రాక్ట్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీ మాటేంది? ఇప్పుడు 1/3 వంతు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మాత్రమే లబ్ధి కలిగించేలా ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఈ విషయాలపై ఉద్యోగ సంఘాలు పోరాడాలి. విజయవాడ కేంద్రంగా వాణిజ్య పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కట్టడి చేయలేని ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణను అడ్డం పెట్టుకొని నాటకాలాడుతోంది. మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏ ఉద్యోగి హర్షించడం లేదు’’ అని అశోక్‌బాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని