Thummala: రాబోయే ఎన్నికల్లో తుమ్మలకే మద్దతు.. నేలకొండపల్లి తెదేపా నేతలు

తుమ్మల నాగేశ్వరరావు రాబోయే ఎన్నికల్లో ఏపార్టీ తరఫున బరిలో నిలిచినా తాము మద్దతిస్తామని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తెదేపా నేతలు పేర్కొన్నారు.

Updated : 29 Nov 2022 09:34 IST

ఈటీవీ, ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు రాబోయే ఎన్నికల్లో ఏపార్టీ తరఫున బరిలో నిలిచినా తాము మద్దతిస్తామని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తెదేపా నేతలు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకే ఆయనకు సహకారం అందించలేకపోయామని.. తుమ్మల ఓటమితో నియోజకవర్గ ప్రజలు, నాయకులందరం ఆలోచనలో పడ్డామన్నారు. పాలేరు నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యమని చెప్పారు. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల్లో భాగంగా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి, కొత్తూరులో తెదేపా నేతలు సోమవారం నిర్వహించిన కార్యక్రమాలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. మండ్రాజుపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. కొత్తూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల ప్రసంగిస్తూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఇచ్చిన అవకాశం వల్లే ఖమ్మం జిల్లాలో 40 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశానన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌ వంటి ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గోదావరి నీరు పాలేరుకు తీసుకొచ్చి పసిడి పంటలు పండించాలన్నదే తన జీవితాశయమన్నారు. ఆత్మీయ సమావేశానికి పిలవడమే కాకుండా ఎన్టీఆర్‌ సాక్షిగా ఈసారి గెలిపిస్తామని చెప్పిన విషయమై తుమ్మల స్పందిస్తూ ‘‘నాకు వేరే మార్గం లేదు.. తప్పకుండా ప్రజల ముందుకొస్తా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని