వైకాపా గెలవడమంటే భాజపా గెలవడమే

‘ఏపీలో రూ.3 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తూ, రూ.11 వేల కోట్లను రోడ్లకు ఇస్తేనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మురిసిపోతున్నారు.

Published : 02 Dec 2022 04:54 IST

మోదీని వ్యతిరేకిస్తున్నందునే తెరాస ప్రభుత్వంపై దాడులు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఈనాడు, దిల్లీ: ‘ఏపీలో రూ.3 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తూ, రూ.11 వేల కోట్లను రోడ్లకు ఇస్తేనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మురిసిపోతున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల కన్నా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా గెలవడమంటే భాజపా గెలవడమే’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దిల్లీలోని ఏపీ/తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ను పిలిచి భాజపా పెద్దలు ఏదో చెప్పడంతో ఆయన స్వరం మారిపోయిందని, వైకాపాకు వ్యతిరేకంగా అంతా ఐక్యంగా ఉండాల్సిన సమయంలో పవన్‌ తప్పుకోవడం సరికాదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులపై మోదీ, అమిత్‌ షాలు ఏకపక్షంగా దాడులు చేయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడులూ ఆ కోవలోనే. మోదీని సమర్థిస్తున్నానని కేసీఆర్‌ చెబితే రాత్రికిరాత్రే ఆ పార్టీ నాయకులపై కేసులన్నీ పోతాయి. గంగలో మునిగినట్లు పవిత్రులవుతారు. గతంలో వేరే పార్టీలో ఉండి భాజపాలోకి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉండి శారదా, నారదా కుంభకోణాల్లో ఇరుక్కున్న వారు భాజపాలో చేరగానే ఎలా మారిపోయారు? వాళ్లపై కేసులు ఏమయ్యాయో అందరికీ తెలుసు’ అని నారాయణ విమర్శించారు. జీ-20 సమావేశాల్లోపే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని