సీమాంధ్రులను ఇబ్బంది పెట్టేలా షర్మిల వ్యాఖ్యలు: జగ్గారెడ్డి

తాను తెలంగాణ కోడల్ని అంటూ షర్మిల మరోసారి ప్రాంతీయ వాదం తెరపైకి తెచ్చి, ఇక్కడ ఉన్న సీమాంధ్రులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకువచ్చారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

Published : 03 Dec 2022 05:08 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తాను తెలంగాణ కోడల్ని అంటూ షర్మిల మరోసారి ప్రాంతీయ వాదం తెరపైకి తెచ్చి, ఇక్కడ ఉన్న సీమాంధ్రులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకువచ్చారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె భాజపా వదిలిన బాణం అయినా ఆమె చేసిన వ్యాఖ్యలు తెరాసకు లబ్ధి చేకూరుస్తాయన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైనందున ఉపాధ్యాయ పోస్టులను పెంచి, భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎమ్మెల్యేల ఎర వ్యవహారంలో భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను, దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే ఎజెండాతో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందన్నారు. మద్యం కేసు కంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్దదని అన్నారు.

రేవంత్‌ది.. నాది తోడికోడళ్ల పంచాయితీ

సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ‘ధరణి’పై ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి తారసపడ్డారు. రేవంత్‌పై తరచూ విమర్శలు చేసే జగ్గారెడ్డి విలేకరుల వద్ద సరదాగా మాట్లాడారు. ‘‘ఇంకా పదేళ్లు అయినా..రేవంత్‌ దిగాక నేనే పీసీసీ అధ్యక్షుడిని అవుతా. మా మధ్య విభేదాలు లేవు. మాది తోడి కోడళ్ల పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం, మళ్లీ కలిసిపోతాం’’ అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని