
Prashanth Kishore: ప్రస్తుత ప్రతిపక్షంతో భాజపాను ఓడించలేం: ప్రశాంత్ కిషోర్
దిల్లీ: భాజపాను ఓడించాలంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను పునరుద్ధించాల్సిన అవసరం ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన స్పందించారు. ఐదు నెలలపాటు చర్చలు జరిపినా.. ఆ పార్టీతో కలిసి పనిచేయలేకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు.
‘‘కాంగ్రెస్ పార్టీ, నేను కలిసి పనిచేస్తే ఇతరులకు అది చూడటానికి చాలా సహజంగానే కనిపిస్తుంది. కానీ, మా మాధ్య పరస్పర విశ్వాసం ఉండాలి కదా.. అదే జరగలేదు. అందుకే కలిసి పనిచేయడం కుదర్లేదు. అయినా, కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాల్సిందే. ఆ పార్టీ లేకపోతే ప్రభావవంతమైన ప్రతిపక్షం సాధ్యపడదు. అయితే, ప్రస్తుత ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకత్వం భాజపాను ఓడించలేదు. ఆ పార్టీని ఓడించాలంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బలమైన కూటమి ఏర్పాటుకు తన వంతు సాయం అందించాలని ఆశపడుతున్నట్లు పీకే వెల్లడించారు.