మిథున్‌ ‘చక్రం’.. భాజపా కొత్త అస్త్రం!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయం రోజురోజుకూ వేడుక్కుతోంది. కీలకమైన నేతలు పార్టీని వీడడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆత్మస్థైర్యం కొంతమేర దెబ్బతినగా.. అదే సమయంలో కొత్తగా..

Published : 08 Mar 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. కీలకమైన నేతలు పార్టీని వీడడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆత్మస్థైర్యం కొంతమేర దెబ్బతినగా.. అదే సమయంలో కొత్తగా చేరికలతో భాజపా బలం రాష్ట్రంలో పుంజుకుంది. మమత తర్వాత రాష్ట్రంలో నంబర్‌ 2గా ఉన్న సువేందు అధికారి తృణమూల్‌ను వీడి భాజపాలో చేరడంతో కొంతమేర కమలానికి ఊపు రాగా.. తాజాగా బెంగాల్‌కు చెందిన బాలీవుడ్‌ నటుడు మిథున్‌చక్రవర్తి చేరికతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. అయితే, మమతను ఢీకొట్టడానికి ఈ బలం సరిపోతుందా? మిథున్‌చక్రవర్తి భాజపా విజయానికి ఎంతమేర తోడ్పడగలరు?

బెంగాల్‌కు చెందిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే, శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. శారదా కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గానూ వచ్చిన మొత్తాన్ని ఆయన ఈడీకి స్వాధీనం చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఎన్నికల ముందు అనూహ్యంగా భాజపాలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు కొద్ది కాలం క్రితమే ఆయన ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌తో భేటీ అయ్యారు. ఆయన సూచన మేరకే మిథున్‌ చక్రవర్తి నాలుగేళ్ల విరామం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సువేందుకు అధికారికి మిత్రుడైన మిథున్‌ చక్రవర్తి చేరికతో భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

మమత వ్యూహానికి చెక్‌ పెట్టేందుకేనా..?
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే తృణమూల్‌ కాంగ్రెస్‌ కొత్త నినాదం అందుకుంది. భాజపా దిల్లీ పార్టీ అని, తాను బెంగాల్‌ కుమార్తెనని మమత ప్రకటించుకున్నారు. ఈ నినాదాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తృణమూల్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, మమత వ్యూహాలకు చెక్‌ పెడుతూ మిథున్‌ చక్రవర్తిని తెరపైకి తీసుకురావడంలో భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బెంగాల్‌ బిడ్డగా ఆయనను ముందు పెట్టడమే కాకుండా.. సీఎం అభ్యర్థిగానూ ప్రకటించాలని భాజపా యోచిస్తోంది. సాధారణంగా భాజపాలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించే సంప్రదాయం లేదు. అయితే, ఆరెస్సెస్‌ సూచించిన వ్యక్తే సీఎం అభ్యర్థిగా నియమితులవుతుంటారు. భాగవత్‌ ఎంపిక చేసిన వ్యక్తి కాబట్టి ఆయనను సీఎం అభ్యర్థిగా పేరును ప్రకటించే అవకాశాలు లేకపోలేవని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మిథున్‌ చక్రవర్తిని ఉద్దేశించి బెంగాల్‌ కుమారుడు అని మోదీ పేర్కొనడం కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. 

తృణమూల్‌ విమర్శలు
తాను పేద ప్రజలకు సేవ చేసేందుకు సరైన వేదిక అని భావించి భాజపాలో చేరానని మిథున్‌ చక్రవర్తి చెప్పారు. మళ్లీ వెనక్కి వెళ్లడానికి కాదని వ్యాఖ్యానించారు. అయితే, మిథున్‌ చక్రవర్తి ప్రభావం బెంగాల్‌ రాజకీయాలపై ఉండదంటూనే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయనకు విశ్వసనీయత లేదని విమర్శించింది. నక్సలైట్‌గా ఉన్న ఆయన.. తర్వాత సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారని, చివరికి కేసుల భయంతో భాజపాకు సరెండర్‌ అయిపోయారని ఆ పార్టీ నేత సౌగత్ రాయ్‌ విమర్శించారు. అయితే, మిథున్‌ చక్రవర్తి గతంలో సీపీఎంతో అనుబంధంగా ఆయన పనిచేసినప్పటికీ ఏ రోజూ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలతో మమేకమవుతారన్న పేరు మాత్రం మిథున్‌కు ఉంది. ఆ అనుభవమే ఇప్పుడు భాజపాకు పనికొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో మిథున్‌ చక్రవర్తి ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది తెలియాలంటే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని