
Cow dung: ఆవు పేడ కొనే యోచనలో మధ్యప్రదేశ్ సర్కార్!
స్వయంగా వెల్లడించిన సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆవు పేడను కొనే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దాన్నుంచి ఎరువులు సహా ఇతర ఉత్పత్తులు తయారు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే పశుసంరక్షణ, చికిత్స నిమిత్తం ‘109’ నంబర్పై ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా ‘ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్’ జరిపే మహిళా పశువైద్యుల సదస్సు ‘శక్తి 2021’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆవు పేడ, మూత్రంతో ఎరువులు, క్రిమిసంహారిణిలు, ఔషధాలు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయొచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో గోవులు, వాటి పేడ, మూత్రం వల్ల కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ సైతం పటిష్ఠమవుతుందన్నారు. మధ్యప్రదేశ్ శ్మశానాల్లో పిడకలను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గోశాలల్ని, సంరక్షణా కేంద్రాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. అయితే, ప్రజల భాగస్వామ్యం లేనిదే అవి మనుగడ సాగించలేవని తెలిపారు.