Janasena: సీఎం జగన్‌ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసు : నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేపథ్యంలో ఏమిటో.. గత చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని, సీఎం పదవి ఆయనకు ముసుగులా ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. 

Published : 23 Nov 2022 01:04 IST

విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేపథ్యం.. గత చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని, సీఎం పదవి ఆయనకు ముసుగులా ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గ సమీక్షల కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ చేసిన ఘనకార్యాలూ ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన నిత్యం పోరాడుతున్న వారికి సాయం చేస్తున్న జనసేన పార్టీకి సీఎం.. కాండక్ట్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు.

‘‘జనసేన పార్టీపై నోటికి వచ్చినట్లు సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పరదాలు కట్టుకోకుండా పర్యటించలేని ఈ సీఎం కూడా మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందుల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడి వారి కోసం పోరాటం చేశాం. డొక్కా సీతమ్మ ఆహార కేంద్రాల పేరుతో భోజనం అందించాం. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. అలాంటి మా పార్టీ పట్ల ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించకుండా, పరదాలు కట్టుకొని, బారికేడ్లు పెట్టుకొని, దుకాణాలు మూయించి వేసి మరీ పర్యటనలకు రావడం ఎక్కడా చూడని వింత చర్య. స్కూళ్లు, కాలేజీలు మూయిస్తున్నారు. ప్రజలను దగ్గరికి రానివ్వకుండా పరిపాలించడం ఈ ముఖ్యమంత్రికే చెల్లుబాటు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

మహిళలకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలి..

వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ బహిరంగ సభలు పెట్టుకొని అదే ప్రభుత్వ గొప్పతనంగా ఈ ముఖ్యమంత్రి భ్రమపడుతున్నారు. సభకు వచ్చిన మహిళల నల్ల చున్నీలను సైతం బయటపెట్టి రమ్మనడం అత్యంత దురదృష్టకరం. ఈ చర్యలు కచ్చితంగా వారిని అవమానించడమే. సభకు మహిళలను బలవంతంగా తీసుకువచ్చి, బహిరంగంగా అవమానపర్చిన ఈ సీఎం మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. చున్నీలు తీసేయాలి, పెన్నులు పడేయాలి అంటూ నిబంధనలు పెడుతున్న పోలీసులను ఏమి అనగలం. వారితో ఆ విధంగా చేయిస్తున్నది ఈ ముఖ్యమంత్రే. వ్యవస్థలను వాడుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ పాలన చేస్తున్న జగన్‌పై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో సీఎం సభలో పెన్నులు నిషేధించారు.. ఇప్పుడు మహిళలను కించపరుస్తూ చున్నీలు కూడా వద్దని చెప్పడం దారుణం. ప్రభుత్వ కార్యక్రమాల్లో విపక్షాలపై ఇష్టానుసారం విమర్శలు చేయకూడదని, నోరు పారేసుకోకూడదనే ఇంగిత జ్ఞానం ఈ సీఎంకు లేదు. ప్రజాధనంతో బహిరంగ సభలు పెట్టి రాజకీయ విమర్శలు చేయడం ఈయనకే చెల్లింది. ఇందులో పోలీసుల తప్పు ఉందని మేము భావించడం లేదు. పైనుంచి వచ్చిన ఆదేశాల్ని వారు పాటిస్తారు. కచ్చితంగా దీనిపై ప్రభుత్వ పెద్దలు మహిళలకు క్షమాపణలు చెప్పాలి.

వైకాపా విముక్త ఏపీ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు..

విజయనగరం జిల్లాలోని సమస్యలపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై, అధికార పార్టీ నేతల అవినీతిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచనల మేరకు వారం రోజుల పాటు సమావేశాలు ఉంటాయి. విజయనగరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిస్థితులపై చర్చిస్తాం. ఈ ప్రభుత్వ పాలన మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అసమర్థత, అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజా సమస్యలపై పోరాడేలా పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తాం. అధికార పార్టీ అరాచకాలకు అన్యాయాలకు ప్రజలు భయపడుతున్నారు. కచ్చితంగా ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు’’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని