PSUల్లో రెండు లక్షల ఉద్యోగాలను తొలగించేశారు: రాహుల్‌

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను కనుమరుగు చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Updated : 18 Jun 2023 16:20 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ (PSU)ల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను కేంద్రం తొలగించేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. తద్వారా లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. కొంత మంది ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే భాజపా (BJP) ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.

పీఎస్‌యూ (PSU)లు ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా ఉండేవని రాహుల్‌ (Rahul Gandhi) అన్నారు. యువత ఉద్యోగాల కలకు అవి నెలవుగా ఉండేవని పేర్కొన్నారు. కానీ, నేడు ఆ పీఎస్‌యూ (PSU)లు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేనే లేవని దుయ్యబట్టారు. ‘‘పీఎస్‌యూల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండేవి. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయి. ప్రగతిశీల దేశంలో ఉద్యోగాలు తగ్గుతాయా? బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1,81,127 ఉద్యోగాలు పోయాయి. సెయిల్‌లో 61,928 ఉద్యోగాలు, ఎంటీఎన్‌ఎల్‌లో 34,997, ఎస్‌ఈసీఎల్‌లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్‌జీసీలో 21,120 ఉద్యోగాలు పోయాయి’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన భాజపా ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలను తొలగించేసిందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. పైగా వీటిలో కాంట్రాక్టు నియామకాలను రెండింతలు చేసిందని తెలిపారు. ఒప్పంద ఉద్యోగులను పెంచడం అంటే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్‌ హక్కును హరించడం కాదా? అని ప్రశ్నించారు. కంపెనీలను ప్రైవేటుపరం చేయాలనే కుట్రేమైనా ఉందా? అని నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలను కనుమరుగు చేయడం.. ఇదేం ‘అమృత్‌కాల్‌’ అని ప్రశ్నించారు. పీఎస్‌యూల (PSU)కు తగిన ప్రాధాన్యం ఇస్తే ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని.. భారత వృద్ధి పథాన్ని సుగమం చేసేలా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని