Payyavula Keshav: ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించారా?: పయ్యావుల

ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని  తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

Updated : 13 Sep 2023 15:09 IST

మంగళగిరి: ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని  తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించిన వారిని ఇలానే అరెస్టు చేసుకుంటూ పోతే రెండు సీట్లకే పరిమితమవుతారని హెచ్చరించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నించారు.

‘‘వైకాపా ప్రభుత్వం వచ్చాక 2021లోనే సీమెన్స్‌ అద్భుత పనితీరు ప్రదర్శించిందని సర్టిఫికెట్‌ ఇచ్చారు కదా? ఒప్పందం ప్రకారం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అన్ని అందాయని ఒకవైపు చెబుతున్నారు కదా? నిధులు పక్కదారి పట్టాయంటున్నారు.. మరి ఇంతవరకు నిరూపించలేకపోయారు ఎందుకు? కేవలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనేదే జగన్‌ కుట్ర. అక్రమ కేసులకు తెదేపా భయపడదు? రేపు రాజకీయ రణక్షేత్రంలో పదింతల శక్తితో ఎదుర్కొంటాం.

Chandrababu Arrest: సీఐడీ కస్టడీ పిటిషన్‌పై 18 వరకు విచారణ చేపట్టొద్దు: హైకోర్టు ఆదేశం

ప్రభుత్వం, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ ఒప్పందం చేసుకున్నాయి. సీమెన్స్‌ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదే? సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు? ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలిగారా? నాలుగేళ్లలో ఏ ఒక్కరోజైనా నోటీసు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు? ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే తెదేపాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. నిజాలు వెలుగులోకి వస్తాయనే సీమెన్స్‌ను పక్కన పెడుతున్నారు’’ అని పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని