బెంగాల్‌.. దంగల్‌

పశ్చిమ బెంగాల్‌ భాజపాకు అందని ద్రాక్ష. కొరకరాని కొయ్యలా మారిన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంటుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో 303 స్థానాలు గెలవడం కన్నా బెంగాల్‌లో 18 స్థానాలు గెలవడం గొప్ప అని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పడం బట్టి చూస్తుంటే ఈ రాష్ట్ర్రాన్ని భాజపా ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.

Updated : 06 Nov 2020 04:37 IST

అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్న నేతలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ భాజపాకు అందని ద్రాక్ష. కొరకరాని కొయ్యలా మారిన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంటుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో 303 స్థానాలు గెలవడం కన్నా బెంగాల్‌లో 18 స్థానాలు గెలవడం గొప్ప అని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పడం బట్టి చూస్తుంటే ఈ రాష్ట్ర్రాన్ని భాజపా ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది. వచ్చే ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు దిల్లీ కాషాయ పెద్దలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. బిహార్‌ ఎన్నికల సడి తగ్గక ముందే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్‌ పర్యటన చేపడుతుండటం ఆ రాష్ట్రంపై భాజపా శ్రద్ధకు అద్దం పడుతోంది. వీటిని బట్టే చెప్పొచ్చు అక్కడ పట్టు సాధించేందుకు కమలనాథులు ఎంత వ్యూహాత్మకంగా పని చేస్తున్నారో అని. అలసి, వెలసిన అరుణ వర్ణ శూన్యాన్ని కాషాయంతో నింపేందుకు ఎంతో పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఎన్నికలకు ఆరు నెలల సమయమున్నా ఇప్పటి నుంచే భాజపా జోరు పెంచింది. ఎన్నికలకు పార్టీని సర్వసన్నద్ధం చేయాలని అమిత్‌షా భావిస్తున్నారు. అందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ముకుల్‌ రాయ్‌, భాజపా ఇన్‌ఛార్జి విజయ్‌ వర్గీయ, పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే బెంగాల్‌ నేతలతో అమిత్‌షా వర్చువల్‌గా సమావేశమై కీలక అంశాలు చర్చించడం జరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత అమిత్‌షా బెంగాల్‌ రావడం ఇదే తొలిసారి. 
ప్రధాన ప్రత్యర్థిగా భాజపా


 

లాక్‌డౌన్‌కు ముందు ఈ ఏడాది మార్చి 1న అమిత్‌షా బెంగాల్‌లో పర్యటించారు. ఇటీవల బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఆ రాష్ట్ర భాజపా నేతలైతే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ధన్కర్‌ కూడా గత గురువారం అమిత్‌షాను దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బెంగాల్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కొంతకాలం వరకు అంతంత మాత్రంగా ఉన్న స్థితి నుంచి ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రధాన ప్రత్యర్థిగా మారిన భాజపా ఈసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
వచ్చే ఏడాది మే నెలలో పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరిగే నాటికి మోదీ అధికారంలోకి వచ్చి రెండో ఏడాది కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు కమలనాథులకు అత్యంత ప్రాధాన్యంగా మారాయి. మోదీ, అమిత్‌షా వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వల్ల ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో లాగా కాకుండా ఇక్కడ మహిళా నేత ఉండటం, ఆమె కేంద్రంతో పోటాపోటీగా ఎదురు నిలవడం వంటి చర్యల వల్ల ఈ రాష్ట్ర ఎన్నికలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. 
ఓవిధంగా చెప్పాలంటే పశ్చిమబెంగాల్‌ భాజపాకు కత్తిమీద సాములా మారింది. ఇతరులతో పోల్చుకుంటే ఎప్పటికప్పుడు పుంజుకుంటూ వస్తున్న కమలనాథులకు ఈసారి పౌరసత్వ సవరణ చట్టం ఇబ్బందులు సృష్టిస్తుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఇక్కడ కాషాయ దళం ఇతర పార్టీలకన్నా మంచి జోరు మీద ఉంది. ఆ జోరుకు ఎన్‌ఆర్‌సీ అడ్డుకట్ట వేస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సరిహద్దుల్లో రాష్ట్రాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశ్చిమబెంగాల్‌ సరిహద్దులో ఉన్న పెద్ద రాష్ట్రం కాబట్టి ఇక్కడ వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు అనేక విధాలుగా సాగుతున్నాయి. 
విజయంపై ధీమా
భాజపా మాత్రం రాష్ట్రంలో విజయంపై ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలోనే మమతపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతోంది. భాజపా వర్చువల్‌ సమావేశంలో దేశంలో రాజకీయ హింసను ప్రోత్సహించే ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ అని అమిత్‌షా చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఈ సభలోనే లోక్‌సభలో 303 స్థానాలు గెలిచిన దాని కంటే బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని ఆయన అన్నారు. రాజకీయ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కేంద్రం అందించే సంక్షేమ పథకాలను మమత పశ్చిమ బెంగాల్‌ వాసులకు అందించడం లేదని ధ్వజమెత్తారు. వలస కార్మికులకు ‘కరోనా ఎక్స్‌ప్రెస్‌’ అని పేరిచ్చిన మమతకు.. అదే ఎగ్జిట్‌ రూట్‌ అని అన్నారు. 
3 సీట్లతో మొదలై
ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం భాజపాకు ఎన్నో ఆశలు పెట్టుకున్నా విజయం మాత్రం అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు. ఒక పద్ధతిగా ఎదుగుతూ రావడం భాజపాకు మొదటి నుంచి అలవాటు. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్‌లోనూ తన వ్యూహం అమలు చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లతో ఖాతా తెరిచింది. ప్రస్తుతం 126 స్థానాల్లో బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న 8 ఎంపీ సీట్లను గెలవడంతో దాని పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగులేని శక్తిగా మారింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బంగ్లా సరిహద్దు స్థానాల్లో ముస్లిం ఓటర్లు  ఎక్కువ. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 90 చోట్ల ఎన్నికల ఫలితాలను ముస్లింలే ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 30శాతం పైగా ఉన్న మైనారిటీలే అన్ని ఎన్నికల్లోనూ గెలుపోటములను నిర్ణయించే స్థితిలో ఉన్నారు. 2011, 2016లో వీరు తృణమూల్‌ కాంగ్రెస్‌ పక్షానే నిలిచారని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. అంతకు ముందు వీరంతా లెఫ్ట్‌ పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు ఓట్లేసేవారు. పదేళ్లుగా మమతాబెనర్జీకే తమ ఓటు అంటున్నారు. ఇప్పుడు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలతో మళ్లీ మమత వైపే మొగ్గు చూపుతారని తృణమూల్‌ వర్గాలు భావిస్తున్నాయి. 
మొత్తంగా చూస్తే 2016 అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇప్పుడు భాజపా ఓట్లు 27శాతం పెరిగినట్లు అంచనా. అయితే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విషయంలో భాజపా వైఖరే వారికి కొత్త ఇబ్బందిగా మారొచ్చని, ఈ విషయంలో మమత భాజపాపై పైచేయి సాధించిందని అంటున్నారు. ఈ విషయంలో కాస్త తడబడినా భాజపాకు కరోనా విషయంలో మమత వైఖరి కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. దానికి తోడు తుపాను వచ్చి రాష్ట్రం అంతా అల్లకల్లోలం కావడం, సహాయ కార్యక్రమాల్లో రాష్ట్ర వైఫల్యం వంటి అంశాలను రాబోయే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది కాషాయ దళం.  
మమతది పాలనలో తనదైన ముద్ర


 

మమతాబెనర్జీ అగ్గిబరాటా. విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న మహిళానేత. జాతీయ రాజకీయాల్ని సైతం తనవైపు తిప్పుకున్న రాజకీయ మేధావి. ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఆమె సొంతం. పాలనలోనూ ఆమె ప్రత్యేక ముద్ర వేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తలలు పండిన ఉద్ధండులైన వామపక్ష నేతల నుంచి కేంద్రంలో అధికార నేతల వరకు ఎవరికీ వెరవని తత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న దీదీ..  ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో తనకు తిరుగు లేదని నిరూపించుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నారు. 

ఇప్పటివరకు స్థానిక వామపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండగా ఈసారి ఎన్నికల్లో భాజపా ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది. ఇప్పటికే భాజపా సైతం కీలక వ్యూహకర్తల్ని రంగంలోకి దింపింది. కానీ తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక బలం మమతా బెనర్జీనే. ఆమె మాత్రమే ఆ పార్టీలో బలమైన నేత. ఆమెకు సరితూగే నేతలెవరూ దరిదాపుల్లో లేరు. అందుకే బాధ్యతలన్నీ భుజ స్కందాలపైనే మోస్తున్నారు. భాజపాతో పోటీ ఉండటంతో వీలున్నప్పుడల్లా కేంద్రంపై విరుచుకుపడుతున్న మమత.. ఈసారి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకున్నారు. 
స్థానికత అంశం టీఎంసీ బలం
భాజపాకు చెక్‌ పెట్టేందుకు స్థానికత అంశంపై దృష్టి పెట్టిన దీదీ.. భాజపాను బయటి పార్టీగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్‌ను పరిపాలించే హక్కు స్థానికులకే ఉందని, ఎక్కడి నుంచో వచ్చిన వారికి కాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అచ్చమైన బెంగాలీ పార్టీ అంటున్న మమత.. బెంగాల్‌ ప్రజల పూర్తి మద్దతు తమ పార్టీకే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. భాజపాను ఉత్తరాది పార్టీగా, బెంగాల్‌ సంస్కృతి తెలియని పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు తృణమూల్‌ నేతలు. కమలదళ నాయకులు మాట్లాడితే రాముడు, హనుమాన్‌ అంటారు అని అసలైన బెంగాలీలు దుర్గా, కాళీ మాత అంటారని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కోల్‌కతాలో ఉండే బిహారీలు, ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులు భాజపాకు ఓటేయడాన్ని స్థానికులకు గుర్తు చేస్తూ దాన్ని ఉత్తరాది పార్టీగా అభివర్ణిస్తున్నారు. సాధారణ బెంగాలీలు ఈ విషయంలో మమతతో అంగీకరిస్తే భాజపాకు అసెంబ్లీలో గెలుపు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. 
అవినీతి ఆరోపణలతో తంటా
తృణమూల్‌ పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు వారికి కొంత ఇబ్బందిగా మారాయి. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తనపై నమ్మకంతోనే ఓట్లు వేయాలని మమత కోరుతున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం ఆమె సహచరులపై శారదా నారదా స్కాం ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అలానే వాళ్లను పట్టించుకోకండి అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థి అనుకొని ఓటేయండి అంటూ ఆమె పిలుపునిచ్చారు. మైనారిటీల ఓట్లను పొందడంతో పాటు హిందూ ఓట్లను పెంచుకోవాలని తృణమూల్‌ భావిస్తోంది. ప్రస్తుతం మైనారిటీల ఆధిపత్యం ఉన్న 90 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ స్థానాల్లోనూ భాజపా పుంజుకోవడం టీఎంసీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఆ విషయం గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో రుజువైంది. 2014తో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌కు 12 ఎంపీ సీట్లు తగ్గిపోయాయి. అప్పట్లో 34 మంది ఎంపీలు గెలవగా, 2019లో 22 మందే విజయం సాధించారు. అయితే 12సీట్లు తక్కువైనా 5శాతం ఓట్లు పెరగడం విశేషం. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఉన్న బలమైన కేడర్‌ ఇంకే పార్టీకి లేదు. మమతా బెనర్జీ ఆమె పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇవన్నీ టీఎంసీకి లాభించే అంశాలు. 
తగ్గిన వామపక్షాల ప్రాబల్యం

గతంలో బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా వామపక్షాలు ఉండేవి. కానీ 2011 నుంచి ప్రతి ఎన్నికల్లో వామపక్షాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ మట్టి కరిపించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం ఇక్కడ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ ఓట్లు కూడా 27 శాతం నుంచి 7 శాతానికి తగ్గిపోయాయి. వామపక్ష ఓట్లలో అత్యధికం భాజపా అభ్యర్థులకు వెళ్లడం గమనార్హం. చివరకు కాంగ్రెస్‌ కూడా రెండు సీట్లతోనే సరిపెట్ట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వల్ల గత ఎన్నికల్లో సీపీఎంకు, కాంగ్రెస్‌కు పొత్తు కుదరలేదు. దాదాపు విడివిడిగానే పోటీ చేశాయి.  భాజపా 40శాతం ఓట్లతో 18 సీట్లు సాధించింది. అంటే సుమారు 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిపత్యం సాధించినట్లు. భాజపా ఇదే జోరుతో గెలవాలని 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. 
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ 42 ఎంపీ సీట్లలో 34 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 4 స్థానాలకు పరిమితమైంది. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన సీపీఎంకు 2 స్థానాలే దక్కాయి. ఆ ఎన్నికల్లో టీఎంసీకి 40శాతం, లెఫ్ట్‌ఫ్రంట్‌కు 30శాతం కాంగ్రెస్‌కు 10శాతం, భాజపాకు 17 శాతం ఓట్లు వచ్చాయి. 2016లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి టీఎంసీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసింది. సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. భాజపా ఒంటరిగానే పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓట్ల శాతం పార్లమెంట్‌ ఓట్ల శాతంలో పోలిస్తే 5 శాతం పెరగడం గమనార్హం. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 45 శాతం ఓట్లు, కాంగ్రెస్‌, సీపీఎం కూటమికి 38శాతం ఓట్లు దక్కాయి. భాజపాకు అంతకు ముందు పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే 7 శాతం ఓట్లు తగ్గాయి. కానీ గడిచిన మూడేళ్ల నుంచి భాజపాకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. టీఎంసీని విడిచిపెట్టి ముకుల్‌రాయ్‌ భాజపాలో చేరినప్పటి నుంచి కమలదళం పుంజుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకొని బెంగాలీలను ఆకట్టుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని