Bandi sanjay: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారు: బండి సంజయ్‌

తెలంగాణ అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన భాజపా ఎన్నికల శంఖారావ సభలో..

Updated : 24 Sep 2022 16:10 IST

హుజూరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో రాజాసింగ్‌, రఘునందన్‌రావు, రాజేందర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)లు ప్రజాగళం వినిపిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన భాజపా ఎన్నికల శంఖారావ సభలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస నేతలు ఈటలతో లబ్ధి పొంది చివరకు ఆయన్ను వదిలించుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే కేసీఆర్‌ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెరాస విషపూరిత ప్రచారాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. నకిలీ ఉత్తరాలు సృష్టిస్తూ .. దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెరాస కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. భాజపా సభకు ఆపార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని