RS Praveen Kumar: కేసీఆర్‌ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరివి?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీలో చేరారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన...

Updated : 08 Aug 2021 22:24 IST

నల్గొండ: మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీలో చేరారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్‌ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా రాంజీ గౌతం ప్రకటించారు.

ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకొనే దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ ద్వారా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వారి కోసమే పదవి వదులుకున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాంటే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని.. కేవలం పాలకులే ఉంటారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే.. ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారే నిర్ణయించుకునేలా చేయాలన్నారు.

విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు..

‘‘విచ్చలవిడిగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులు?గిరిజన, ఆదివాసీ బిడ్డలు సాగు చేసిన డబ్బులే ఇచ్చారు. మా కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మాపై ప్రేమ ఉంటే మీరు సంపాదించిన సొమ్ము ఇవ్వాలి. పేదలకు వైద్యం, విద్య, ఉపాధి, నైపుణ్యం కావాలి. గురుకుల పాఠశాలల ద్వారా కేవలం 4 లక్షల మందికే విద్య అందుతోంది. 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారు. పేదలు చదివే వర్సిటీల్లో 3-4 ఏళ్లుగా నియామకాలు లేవు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు కోసం తాపత్రయపడుతున్నారు. మరి ప్రైవేట్‌ వర్సిటీల్లో రిజర్వేషన్‌ ఎందుకు పెట్టలేదు? ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని