ప్రధాని పదవికి మన్మోహన్‌ సింగ్‌కు బదులు ఆయన్ను ఎంపిక చేయాల్సింది..!

2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన సమయంలో సోనియా గాంధీ ప్రధానమంత్రిగా ఉండాల్సిందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యలు చేశారు. లేకపోతే ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ప్రధానిగా ఎంపిక చేయాల్సిందని అన్నారు. ఈ సందర్భంగా సోనియాకు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మధ్య పోలిక తెచ్చారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. 

Updated : 28 Sep 2021 01:42 IST

కేంద్రమంత్రి వ్యాఖ్యలు

దిల్లీ: 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన సమయంలో సోనియా గాంధీ ప్రధానమంత్రిగా ఉండాల్సిందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యలు చేశారు. లేకపోతే ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ప్రధానిగా ఎంపిక చేయాల్సిందని అన్నారు. ఈ సందర్భంగా సోనియాకు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మధ్య పోలిక తెచ్చారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

‘2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధానిగా ఉండాల్సింది. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కాగా లేనిది, సోనియా ప్రధాని మంత్రి అయితే తప్పేంటి..?ఆమె భారత మాజీ ప్రధాని సతీమణి. భారత పౌరసత్వం పొందారు, పార్లమెంట్ సభ్యురాలు’ అని అథవాలే వ్యాఖ్యానించినట్లు ఆ కథనం పేర్కొంది. ఆమె విదేశీ మూలాలు గురించి మాట్లాడటం అర్థం లేనిదన్నారు. ‘సోనియా ప్రధాని పదవిని చేపట్టాలని నేను ప్రతిపాదించాను. అది కాకపోతే మన్మోహన్ సింగ్‌కు బదులు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆ పదవికి ఎంపిక చేయాల్సింది. కానీ ఆమె అలా చేయలేదు’ అని అన్నారు. పవార్‌కు ఆ బాధ్యత ఇచ్చిఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అథవాలే పార్టీ భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షం.

2004లో యూపీఏ కూటమి నుంచి మన్మోహన్ సింగ్ ప్రధానిగా నియమితులయ్యారు. పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మరోపక్క మొదట్లో కాంగ్రెస్‌లో ఉన్న శరద్‌ పవార్.. సోనియాకు వ్యతిరేకంగా గళం వినిపించి, పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. ఆ తర్వాత ఎన్‌సీపీని స్థాపించారు. అయితే పలు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తుంటాయి. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఈ రెండు పార్టీలు భాగమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని