ఉద్యోగాల పేరుతో తెరాస నాటకం: కోదండరాం

ఉద్యోగాల పేరుతో తెరాస ప్రభుత్వం నాటకాలాడుతోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు.

Published : 16 Dec 2020 01:51 IST

హైదరాబాద్‌ : ఉద్యోగాల పేరుతో తెరాస ప్రభుత్వం నాటకాలాడుతోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం 34 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని వివరించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందనే నమ్మకం తమ పార్టీకి లేదని కోదండరాం స్పష్టం చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖాళీ పోస్టుల సమాచారం ఉన్నప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇటీవల దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ జోనల్‌ వ్యవస్థ మీద స్పష్టత తీసుకురాలేదన్నారు. పాత జోనల్ విధానం ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని  పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలఖారులోపే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని, మార్చి లోపు పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. 

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురవడంతోనే తెరాస ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసిందని వ్యా్ఖ్యానించారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ రావాల్సి ఉండగా ఇంకా.. పాతది కూడా అందలేదన్నారు. ప్రభుత్వానికి ఆంధ్రా గుత్తేదారుల జేబులు నింపడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై లేదని విమర్శించారు. ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా పదోన్నతులు ఇవ్వడంలేదని గుర్తు చేశారు. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల బకాయిలు ఉన్నాయని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని