KTR: అభివృద్ధి, అత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టంకట్టారు: కేటీఆర్
మునుగోడులో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో తెరాస విజయం సాధించిన తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: అభివృద్ధికి, అత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టంకట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో తెరాస విజయం సాధించిన తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘‘కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు. విజయం కోసం పనిచేసిన తెరాస కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు. గొప్పగా పనిచేసి కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇతర నాయకులకు అభినందనలు. నల్గొండ జిల్లాలో 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన 3 ఉప ఎన్నికల్లో తెరాసకు పట్టంకట్టిన జిల్లా ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దింది నరేంద్రమోదీ, అమిత్ షా. వారికి ఓటర్లు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు.
పాత్రధారి రాజగోపాల్రెడ్డి.. సూత్రధారులు మోదీ, అమిత్ షా..
అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కావొచ్చు.. కానీ, వెనుక ఉండి నడిపించింది మోదీ, అమిత్ షా. మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుకు వారికి చెక్కర్ వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలని రాజకీయ క్రీడకు భాజపా తెరలేపింది. తెరాస అభ్యర్థికి ఇంకా మెజార్టీ రావాల్సి ఉంది.. కానీ, భాజపా రూ.వందల కోట్లు ఖర్చు పెట్టింది. డబ్బు, అధికార మదంతో మునుగోడు ప్రజలను కొనాలని చూశారు. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే రూ.కోటితో దొరికింది భాజపా కార్పొరేటర్. ఈటల రాజేందర్ అనుచరుడు కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో దొరికింది నిజం కాదా. డాక్టర్ వివేక్.. గుజరాత్ నుంచి రూ.2.5కోట్లు హవాలా ద్వారా తెప్పించింది నిజం కాదా? వివేక్ కంపెనీ నుంచి రూ.75కోట్లు రాజగోపాల్రెడ్డి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది వివేక్ కాదా? రాజగోపాల్రెడ్డి కంపెనీ సుశీ ఇన్ఫ్రా నుంచి మనుగోడు ప్రజల ఖాతాల్లోకి రూ.5.25 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా చేశారు.
గతంలో కంటే తెరాసకు ఓట్ల శాతం పెరిగింది
15 కంపెనీల సీఆర్పీఎఫ్ బృందాలను, 40 ఐటీ టీమ్లను మునుగోడు కోసం రంగంలోకి దించారు. మంత్రి జగదీశ్రెడ్డి పీఏ నివాసంలో డబ్బులు దొరికాయని అసత్య ప్రచారం చేశారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ మెజార్టీని తగ్గించగలిగారు కానీ, గెలుపును అడ్డుకోలేక పోయారు. ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ, మునుగోడు ఉప ఎన్నిక మాత్రమే ఎందుకు ధనమయమైందో ప్రజలు ఆలోచించాలి. ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం చేస్తోంది భాజపా కాదా? రూ.వందల కోట్లు ఇచ్చి ఎన్నికల్లో ఎలాగైనా గెలవండని అడ్డదారులు తొక్కుతున్నది భాజపా కాదా? అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. 15 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 40 ఐటీ టీమ్లు మునుగోడులో ఉండగానే అక్రమాలు జరిగాయా? తెరాస మహిళా ఓటర్ల చేతులపై గోరింటాకుతో కమలం పువ్వు గుర్తు వేసి చిల్లర రాజకీయాలు చేశారు. ఓటమిని హుందాగా ఒప్పుకునే ధైర్యం భాజపా నేతలకు ఉండాలి. కారును పోలిన గుర్తులకు 6వేల ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను మేనేజ్ చేస్తామని దిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు కూడా చెబుతున్నారు. గెలుపోటములను హుందాగా స్వీకరించే స్థిత ప్రజ్ఞత తెరాసకు ఉంది. మా పార్టీని పోలిన గుర్తులు తెచ్చినా మేం ఎక్కడా ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించలేదు. పలివెలలో పల్లా రాజేశ్వర్రెడ్డిపై దాడి చేశారు. 12మంది తెరాస కార్యకర్తల రక్తం కళ్లచూశారు. సానుభూతి కోసం ఈటల రాజేందర్ ప్రెస్మీట్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ బండి సంజయ్ అర్ధరాత్రి వేసిన నాటకాలను ప్రజలు పట్టించుకోలేదు. కర్రు కాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజల చైతన్యానికి ధన్యవాదాలు. మునుగోడులో తెరాసకు గతంలో 34.29 శాతం ఓట్లు వస్తే.. ఈసారి 43శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే 9శాతం ఓట్లు పెరిగాయి’’ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?