Yogi Adityanath: తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ.. గోరఖ్‌పుర్‌ నుంచి నామినేషన్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పుర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 04 Feb 2022 14:10 IST

యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన అమిత్‌ షా

గోరఖ్‌పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పుర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో యోగీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఉన్నారు. నామినేషన్‌ దాఖలు కంటేముందు అక్కడి గోరఖ్‌నాథ్‌ ఆలయంలో యోగీ ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, యోగీ ఆదిత్యనాథ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

యోగీ ఆదిత్యనాథ్‌ నామినేషన్‌ దాఖలు కంటే ముందు ఇరు నేతలు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా యూపీ సీఎంను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా యోగీని పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌ను మాఫియా నుంచి విముక్తి చేసిన ఘనత యోగీ ఆదిత్యనాథ్‌దే. 25ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సరైన పాలనను తిరిగి అందించారు’ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా కొవిడ్‌ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశారని చెప్పుకొచ్చారు. భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ను నిలిపారని తెలిపారు. కొవిడ్‌పై అత్యంత సమర్థవంతంగా పోరాడారని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యే కాని వ్యక్తులే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లు ప్రకటించగానే.. మాజీ సీఎం అఖిలేష్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు యూపీలోని కర్హల్‌ నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని