Tajmahal: తాజ్‌మహల్‌ గదుల్లో దేవతల విగ్రహాలు లేవు

ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ).. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)

Updated : 04 Jul 2022 07:36 IST

భారత పురావస్తు శాఖ వెల్లడి

ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ).. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాజ్‌ మహల్‌ నేలమాళిగలో(బేస్‌మెంట్‌) మూసి ఉన్న గదులు కానీ, హిందూ దేవతల విగ్రహాలు కానీ లేవని ఏఎస్‌ఐ పునరుద్ఘాటించింది. ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చింది. తాజ్‌మహల్‌ నేలమాళిగలో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. అందులో మూసి ఉన్న 22 గదులను తెరవాలని.. అయోధ్య భాజపా మీడియా ఇన్‌ఛార్జి డా.రజనీశ్‌ కుమార్‌ 2022, మే 7న అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఆ గదులు తెరిచేలా ఏఎస్‌ఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆ వ్యాజ్యంలో కోరారు. అయితే.. మే 12న ధర్మాసనం దీనిని తోసిపుచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి సాకేత్‌ గోఖలే.. జూన్‌ 21న ఆర్‌టీఐ కింద ఏఎస్‌ఐని కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘‘తాజ్‌ మహల్‌ ఉన్న భూమి.. ఏదైనా ఆలయానికి చెందినదా? తాజ్‌ మహల్‌ నేలమాళిగలోని మూసి ఉన్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా.. మూసిఉన్న గదుల్లేవని, ఆ ప్రదేశమూ ఏ ఆలయానికి చెందినది కాదని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని