అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి

అంతర్జాతీయ అంశాల్లో నియమాల ఆధారంగా నడుచుకోవాలని జీ7 కూటమి, భారత్‌ సహా ఐదు భాగస్వామ్య దేశాలు పిలుపునిచ్చాయి. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరాయి. ఐరాస మూలసూత్రాలను

Updated : 29 Jun 2022 11:06 IST

ప్రజాస్వామ్యాలు బలపడాలి

జీ7, ఐదు ఆహ్వానిత దేశాల పిలుపు

ఎల్‌మావ్‌: అంతర్జాతీయ అంశాల్లో నియమాల ఆధారంగా నడుచుకోవాలని జీ7 కూటమి, భారత్‌ సహా ఐదు భాగస్వామ్య దేశాలు పిలుపునిచ్చాయి. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరాయి. ఐరాస మూలసూత్రాలను పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. జర్మనీలోని ఎల్‌మావ్‌లో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో అనేక అంశాలపై చర్చ జరిగింది. ఇందులో కూటమికి చెందిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌, కెనడా, జపాన్‌తోపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్‌, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా దేశాల అగ్రనేతలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా పోరు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దురుసు చర్యలను ఇందులో పరోక్షంగా ప్రస్తావించారు. ఉమ్మడి ప్రకటనలోని ప్రధానాంశాలివీ..

* ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలను పెంపొందించడానికి వివిధ దేశాల్లోని జాతీయ చట్టాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల సమర్థతను పెంచేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంచుతాం. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న చర్యలను వ్యతిరేకిస్తాం.

* ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛాయుత ఎన్నికలకు మద్దతిస్తాం. వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత, జీవ వైవిధ్యానికి నష్టం, ఇంధన భద్రత వంటి అంశాలకు మద్దతిస్తాం.

* ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఏర్పడిన ముప్పును ఎదుర్కోవడానికి 450 కోట్ల డాలర్లను వెచ్చించాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం అమెరికా 276 కోట్ల డాలర్లను సమకూర్చనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది.

ముగిసిన సదస్సు

మూడు రోజుల పాటు సాగిన జీ7 సదస్సు మంగళవారం ముగిసింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామని, రష్యాపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చేందుకు కూటమి నేతలు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం వీరు ‘నాటో’ సమావేశం కోసం మాద్రీద్‌ పయనమయ్యారు.


దేశాధినేతలకు మోదీ కానుకలు

ప్రధాని మోదీ.. జీ7 శిఖరాగ్ర సదస్సులో  భారతీయ ఘన సంస్కృతి, కళా నైపుణ్యాలను చాటిచెప్పేలా వివిధ దేశాల నేతలకు ప్రత్యేక కానుకలను అందించారు.

* అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు గులాబీ మీనాకారి ఆభరణం, కఫ్‌లింక్‌ సెట్‌ కానుకగా ఇచ్చారు. వారణాసిలో వెండితో చేసే వివిధ రకాల ఉత్పత్తులను బనారస్‌ గులాబీ మీనాకారి పేరుతో మార్కెటింగ్‌ చేస్తుంటారు. కఫ్‌లింక్‌ సెట్‌ను బైడెన్‌ కోసం, మీనాకారి ఆభరణాన్ని ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ కోసం ప్రత్యేకంగా చేయించారు. 

* జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు నికెల్‌ లోహం పూతపూసిన.. ప్రత్యేక ఇత్తడి పాత్రలను బహుకరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇత్తడి నగరంగా పేరొందిన మొరాదాబాద్‌కు చెందిన ఈ కళాఖండాలను చేతితో చేస్తారు.

* బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు.. చేతితో ప్లాటినం పూత పూసిన టీ-సెట్‌ను ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో దీన్ని తయారుచేశారు. బ్రిటన్‌ రాణి ప్లాటినం జూబ్లీని పురస్కరించుకొని.. ప్లాటినం పెయింట్‌తో కూడిన పింగాణీ పాత్రలను ప్రత్యేకంగా చేయించారు.

* ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో చేసిన జర్దోజీ బాక్స్‌ను అందించారు.

* చేతితో చేసిన పట్టు తివాచీలను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు కానుకగా ఇచ్చారు.

* జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాకు.. ఉత్తర్‌ప్రదేశ్‌ నిజామాబాద్‌లో తయారైన నల్ల కుండలను అందించారు. 

* పాలరాయి పొదిగిన టేబుల్‌ టాప్‌ను ఇటలీ ప్రధాని మారియో డ్రాగీకి ఇచ్చారు.

* రామాయణ ఇతివృత్తంతో కూడిన ధోక్రా కళాఖండాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాకు ఇచ్చారు. 

* అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌కు నంది థీమ్‌తో చేసిన ధోక్రా ఆర్ట్‌ బహుకరించారు మోదీ. ఇది ఛత్తీస్‌గఢ్‌లో తయారైంది. 

* సెనెగల్‌ అధ్యక్షుడు మ్యాకీ సాల్‌కు.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రసిద్ధి చెందిన మూంజ్‌ బుట్టలు, సీతాపుర్‌కు చెందిన కాటన్‌ డర్రీని (రగ్గు) అందజేశారు. 

* లక్క పూత పూసిన అలంకార వస్తువు.. ‘రామ్‌ దర్బార్‌’ను ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోకు బహుకరించారు. ఇది వారణాసిలో ప్రసిద్ధి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని