Asia Cup 2023: జట్టులో అతడు లేకపోవడం ఆశ్చర్యకరం.. నా బెస్ట్‌ పార్ట్‌నర్‌ మాత్రం కోహ్లీనే!

సీనియర్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండానే ఆసియా కప్‌ (Asia Cup 2023) బరిలోకి టీమ్‌ఇండియా (Team India) దిగబోతోంది. దీనిపై నిరుత్సాహం వ్యక్తం చేసిన ఏబీ డివిలియర్స్‌.. టీ20ల్లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడాలని ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించాడు.

Published : 27 Aug 2023 13:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం బరిలోకి దిగే భారత జట్టులోకి కొత్త ఆటగాడు తిలక్‌ వర్మ వచ్చాడు. గాయాలతో పోరాడి కోలుకుని వచ్చిన శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌కూ చోటు దక్కింది. కానీ, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ జాబితాలో మాత్రం చాహల్‌ను (Chahal) కాదని కుల్‌దీప్‌ను తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. చాహల్‌ను పక్కన పెట్టడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. అలాగే ఆర్‌సీబీ తరఫున ఆడినప్పుడు విరాట్ కోహ్లీనే (Virat Kohli) తన సరైన జోడీగా అభివర్ణించాడు. 

‘‘చాహల్‌ను పక్కన పెట్టారు. ఎవరిని తీసుకోవాలనే దానిపై స్పష్టతతోనే సెలెక్టర్లు ఉన్నారని భావిస్తున్నా. అయితే, జట్టు ఎంపిక మాత్రం నాకు కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. యుజ్వేంద్ర చాహల్‌ ఎప్పుడూ జట్టును గెలిపించగల బౌలర్. ఇలాంటి లెగ్‌ స్పిన్నర్‌ జట్టులో ఉండాల్సింది. అతడి నైపుణ్యాలు అద్భుతం. ఆర్‌సీబీ తరఫున ఉన్నప్పుడు చాహల్‌ బౌలింగ్‌ను ప్రత్యక్షంగా చూశా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సత్తా అతడికుంది. 

పెద్ద టోర్నీల్లో డెబ్యూ వద్దు.. వారిద్దరికీ చోటు లేదు.. సచిన్-ధోనీ సమానమే!

దక్షిణాఫ్రికా తరఫున ఆడేటప్పుడు హషీమ్ ఆమ్లాతో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఆస్వాదించేవాడిని. మేమిద్దరం చాలాసార్లు అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మించాం. ఇక టీ20, ఐపీఎల్‌లో అయితే నాకెంతో ఇష్టమైన జోడీ విరాట్ కోహ్లీనే. మా ఇద్దరి ఆటతీరు ఒక్కోసారి ఢీకొట్టుకున్నట్లు ఉన్నప్పటికీ ఒకేలా బ్యాటింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రత్యర్థి నుంచి వెంటనే మ్యాచ్‌ను తీసుకోవాలని కోరుకుంటాం. అందుకే, పొట్టి ఫార్మాట్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌ భాగస్వామి మాత్రం విరాట్ కోహ్లీనే అని చెప్పగలను. ఒక్కోసారి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. అలాంటప్పుడు అతడు లేదా నేను ఔటైనప్పటికీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి వెనుకాడం. ఒకవేళ ఆర్‌సీబీ 30/3 స్థితిలోనూ మేమిద్దరం ఐదో గేర్‌ వేసి మరీ పరుగులు రాబట్టేందుకు ముందుకెళ్తాం. ఇలా మేమిద్దరం భారీ భాగస్వామ్యాలతో పరుగులు రాబట్టిన సందర్భాలు కోకొల్లలు’’ అని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని