సంక్షిప్త వార్తలు (3)

జాతీయ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు జోరు చూపించారు.

Updated : 31 Jan 2023 03:46 IST

పారా క్రీడల్లో ‘లక్ష్య’ అథ్లెట్ల జోరు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు జోరు చూపించారు. గుజరాత్‌లో జరిగిన ఈ పోటీల్లో  6 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్యంతో సహా మొత్తం 12 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో చిన జీయర్‌ స్వామి నేత్ర విద్యాలయా (విశాఖపట్నం) క్రీడాకారులు పది పతకాలు సాధించారు. 100 మీ, 1500 మీ పరుగులో లలిత 2 స్వర్ణాలు; 100 మీ, షాట్‌పుట్‌లో రవ్వాణి 2 స్వర్ణాలు గెలుచుకున్నారు. మణికంఠ.. 100 మీ పరుగులో స్వర్ణం, లాంగ్‌జంప్‌లో రజతం సాధించాడు. షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గిన అక్షయ అనురాధ.. 100 మీ పరుగులో రజతం గెలిచింది. 100 మీ పరుగులో గౌతమ్‌ రజతం, షాట్‌పుట్‌లో సూర్య రోహిత్‌ కాంస్యం నెగ్గారు. శ్రీకాకుళానికి చెందిన లోకేశ్‌.. హైజంప్‌, లాంగ్‌జంప్‌లో రజత పతకాలు సాధించాడు.


థాయ్‌లాండ్‌ ఓపెన్‌కు సాత్విక్‌ జోడీ దూరం

బ్యాంకాక్‌: భారత స్టార్‌ డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌శెట్టి, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌, మాళవిక బాన్సోద్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి వైదొలిగారు. ‘‘సాత్విక్‌ గాయం నయమవలేదు. అందుకే థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ఆడట్లేదు. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌పై దృష్టిసారిస్తాం’’ అని చిరాగ్‌ తెలిపాడు. మంగళవారం ప్రారంభమయ్యే థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సాయి ప్రణీత్‌, సమీర్‌ వర్మ, ప్రియాంశు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌, మిథున్‌ మంజునాథ్‌, అనుపమ ఉపాధ్యాయ, అష్మిత చాలిహా, గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ, సిక్కిరెడ్డి- శ్రుతి మిశ్రా, అశ్విని-తనీషా, సుమీత్‌రెడ్డి- అశ్విని, రోహన్‌ కపూర్‌- సిక్కి, ఇషాన్‌- తనీషా బరిలో ఉన్నారు.


ఖేలో ఇండియాతో జట్టుకట్టిన ఎస్‌ఎఫ్‌ఏ

ఈనాడు, హైదరాబాద్‌: భారత భవిష్యత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఖేలో ఇండియా మిషన్‌తో స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) జట్టుకట్టింది. దేశంలో క్రీడాభివృద్ధి కోసం రానున్న అయిదేళ్లలో రూ.12.5 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రాల్లో ఖేల్‌ ఇండియా కేంద్రాల అభివృద్ధి, ప్రతిభాన్వేషణ, మహిళా క్రీడలు, దివ్యాంగ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతో సహా 12 అంశాలపై ఎస్‌ఎఫ్‌ఏ దృష్టిసారించనుంది. దేశంలో క్షేత్ర, అట్టడుగు స్థాయిలో అన్ని క్రీడల్ని పటిష్ట పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘‘అట్టడుగు స్థాయిలో క్రీడలకు అండగా నిలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. 2015 నుంచి దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఏ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టోర్నీలు నిర్వహించింది. భారత్‌లో క్రీడా సంస్కృతి పెంపొందించడం కోసం ఖేలో ఇండియా మిషన్‌తో చేతులు కలపడం ఆనందంగా ఉంది. క్షేత్ర స్థాయిలో క్రీడాభివృద్ధి కోసం ఎస్‌ఎఫ్‌ఏ కృషిచేస్తుంది. వచ్చే మూడేళ్లలో 20 రాష్ట్రాల్లో 15 లక్షల మంది చిన్నారులకు పోటీలు నిర్వహిస్తాం’’ అని ఎస్‌ఎఫ్‌ఏ వ్యవస్థాపకుడు రిషికేశ్‌ జోషి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని