చుట్టేస్తారా?

బ్యాటింగ్‌లో తిరుగులేదు.. బౌలింగ్‌లో ఎదురులేదు.. ప్రత్యర్థి నుంచి అసలు పోటీనే లేదు.. ఆఖరి టీ20లోనే భారతే ఫేవరెట్‌. బుధవారం అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందనే అందరి అంచనా.

Updated : 17 Jan 2024 07:23 IST

క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి
అఫ్గాన్‌తో మూడో టీ20 నేడు
రాత్రి 7 నుంచి
బెంగళూరు

బ్యాటింగ్‌లో తిరుగులేదు.. బౌలింగ్‌లో ఎదురులేదు.. ప్రత్యర్థి నుంచి అసలు పోటీనే లేదు.. ఆఖరి టీ20లోనే భారతే ఫేవరెట్‌. బుధవారం అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందనే అందరి అంచనా. ఇప్పుడు అంతా చూస్తోంది కెప్టెన్‌ రోహిత్‌ శర్మవైపే. టీ20 ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియా ఆడుతున్న ఆఖరి టీ20లోనైనా అతడు రాణిస్తాడా..?

కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే 2-0తో సిరీస్‌ గెలుచుకున్న టీమ్‌ఇండియా అఫ్గానిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్‌ ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. టీ20 ప్రపంచకప్‌ ముందు దూకుడే మంత్రంగా టీమ్‌ఇండియా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో 17.3 ఓవర్లకు 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే.. రెండో మ్యాచ్‌లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఆరంభంలో వికెట్లు పడినా ధాటిగా ఆడాలన్న లక్ష్యంతో ఈ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు కనిపించారు. శివమ్‌ దూబె వరుస మ్యాచ్‌ల్లో మెరుపు అర్ధశతకాలు బాది ఆకట్టుకోగా.. రెండో టీ20లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, కోహ్లి సత్తాచాటారు. 14 నెలల విరామం తర్వాత టీ20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి 181 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్‌లో కాస్త నెమ్మదిగా ఆడే అతడు ముజీబ్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్‌ రోహితే పరుగులు అందుకోవాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన అతడు.. మూడో టీ20లో సత్తాచాటాలని జట్టు కోరుకుంటోంది. పరిస్థితులు ఎలా ఉన్నా బాదడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా అదే వ్యూహంతో మరోసారి బరిలో దిగనుంది.

కుల్‌దీప్‌ను ఆడిస్తారా..? ఇప్పటికే సిరీస్‌ గెలిచినా.. టీమ్‌ఇండియా ఎక్కువ ప్రయోగాలు చేయకపోవచ్చు. బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. వికెట్‌కీపర్‌గా సంజు శాంసన్‌కు అవకాశమిస్తారా అన్నది చూడాలి. నిరుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నాలుగో టీ20లో అవకాశం దక్కించుకున్న జితేశ్‌ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అతడి బదులు శాంసన్‌కు ఛాన్స్‌ ఇవ్వొచ్చు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించే అవకాశముంది. ముకేశ్‌ కుమార్‌ స్థానంలో అవేష్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు లభించొచ్చు. రషీద్‌ ఖాన్‌ లేక బలహీనంగా మారిన అఫ్గాన్‌.. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌పై ఆశలు పెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడు పెద్దగా రాణించలేదు. సిరీస్‌లో అఫ్గాన్‌ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు రాణించినా.. సమష్టిగా ఆ జట్టు భారత్‌కు గట్టిపోటీ ఇవ్వడంలో విఫలమైంది. మరి ఆఖరి మ్యాచ్‌లోనైనా అఫ్గాన్‌ ఆట మారుతుందేమో చూడాలి.  

తుది జట్లు(అంచనా): భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కోహ్లి, శివమ్‌ దూబె, జితేశ్‌ శర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌/కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌/అవేష్‌ ఖాన్‌

అఫ్గానిస్థాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, గుల్బదీన్‌ నైబ్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబి, నజీబుల్లా జద్రాన్‌, కరీమ్‌ జనత్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ


పరుగుల పిచ్‌

చిన్న బౌండరీలు కలిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పరుగులకు పెట్టింది పేరు. అయితే అందుకు భిన్నంగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో భారత్‌ 160 పరుగులను కాపాడుకుంది. ప్రపంచకప్‌లో అయిదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన బెంగళూరులో.. కొత్త పిచ్‌పై ఈ మ్యాచ్‌ జరగనుంది. ఎప్పటిలా పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలే ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని