కుర్రాళ్ల మోత...భారత్‌ 405/5

భారత కుర్రాళ్లు ఏం కొట్టారు.. బంతి పడితే బౌండరీ వచ్చేలా.. గాల్లోకి ఎగిరితే స్టాండ్స్‌లో పడేలా.. ఎడాపెడా బాదేశారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన యువ భారత్‌ తమ చివరి గ్రూప్‌- బి మ్యాచ్‌లో

Updated : 23 Jan 2022 06:52 IST

తరౌబా: భారత కుర్రాళ్లు ఏం కొట్టారు.. బంతి పడితే బౌండరీ వచ్చేలా.. గాల్లోకి ఎగిరితే స్టాండ్స్‌లో పడేలా.. ఎడాపెడా బాదేశారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన యువ భారత్‌ తమ చివరి గ్రూప్‌- బి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఉగాండాతో శనివారం మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వీరవీహారం చేశారు. రాజ్‌ బవా (162 నాటౌట్‌, 108 బంతుల్లో 14×4, 8×6), రఘువంశీ (144; 120 బంతుల్లో 22×4, 4×6) సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్‌ హర్నూర్‌ (15)తో పాటు కెప్టెన్‌ (15) నిశాంత్‌  విఫలమైనప్పటికీ.. జట్టుపై ఆ ప్రభావం పడకపోవడానికి ప్రధాన కారణం రఘువంశీ, రాజ్‌ జోడీనే. ప్రత్యర్థి బౌలర్లను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా వీళ్లు చెలరేగారు. ఒకరితో మరొకరు పోటీపడుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. ఆ క్రమంలో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 206 పరుగులు జతచేసింది. ఆ తర్వాత రఘువంశీ ఔటైనా.. రాజ్‌ విధ్వంసాన్ని కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లలో పాస్కల్‌ (3/72) ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకై ఆలౌటైంది. దీంతో భారత జట్టు 326 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్‌-బీలో అగ్ర స్థానానికి చేరింది. కెప్టెన్‌ నిషాంత్‌ సింధు నాలుగు వికెట్లు తీశాడు. రాజ్‌ బవాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని