పారా వీరుడికి పద్మభూషణ్‌

ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో క్రీడాకారులకూ మంచి ప్రాధాన్యమే దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడల్లో ఎవరూ పురస్కారం అందుకోకున్నా.. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిదిమంది క్రీడాకారులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పారా జావెలిన్‌లో రాణిస్తూ గొప్ప విజయాలు సాధించిన ప్రముఖ అథ్లెట్‌ దేవేంద్ర జజారియాను

Published : 26 Jan 2022 04:53 IST

దేవేంద్రకు మూడో అత్యున్నత పౌర పురస్కారం
నీరజ్‌ సహా 8 మందికి పద్మశ్రీ
దిల్లీ

ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో క్రీడాకారులకూ మంచి ప్రాధాన్యమే దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడల్లో ఎవరూ పురస్కారం అందుకోకున్నా.. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిదిమంది క్రీడాకారులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పారా జావెలిన్‌లో రాణిస్తూ గొప్ప విజయాలు సాధించిన ప్రముఖ అథ్లెట్‌ దేవేంద్ర జజారియాను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ వరించింది. జావెలిన్‌ క్రీడాకారుడైన 40 ఏళ్ల దేవేంద్ర మూడుసార్లు పారాలింపిక్స్‌లో పోటీ పడి మూడుసార్లూ పతకాలు గెలిచాడు. 2004లో తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీ పడి స్వర్ణం సాధించిన అతను.. 2016లోనూ పసిడి అందుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు.

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నను అందుకున్న సంగతి తెలిసిందే. షూటర్‌ అభినవ్‌ బింద్రా తర్వాత భారత్‌ తరఫున  ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం అందుకున్న క్రీడాకారుడు అతనే. టోక్యో పారాలింపిక్స్‌లో సత్తా చాటిన షూటర్‌ అవని లేఖరా, షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌లకు కూడా పద్మశ్రీ దక్కింది. టోక్యోలో అవని స్వర్ణం, కాంస్యం నెగ్గగా.. ప్రమోద్‌, సుమిత్‌ పసిడి పతకాలు గెలిచారు. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో గొప్ప ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలైన వందన కఠారియా, భారత ఫుట్‌బాల్‌  జట్టు మాజీ కెప్టెన్‌ బ్రహ్మానంద్‌ శంఖ్వాల్కర్‌, కేరళలో ప్రసిద్ధి చెందిన యుద్ధ   క్రీడ కలరియపట్టులో నిపుణుడైన 93 ఏళ్ల శంకరనారాయణ మీనన్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారుడు ఫైజల్‌ అలీ దర్‌ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.


నీరజ్‌కు మరో పురస్కారం

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, సుబేదార్‌ నీరజ్‌ చోప్రా మరో గౌరవాన్ని అందుకోనున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నీరజ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘పరమ విశిష్ట సేవా పురస్కారం’తో సత్కరించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని