Dhoni: మళ్లీ ధోనీకే చెన్నై పగ్గాలు.. కెప్టెన్సీకి జడేజా రాజీనామా

చెన్నై పగ్గాలు మరోసారి మహేంద్ర సింగ్‌ ధోని చేతికే వచ్చాయి. జడేజా ఆ బాధ్యతలను వదులుకున్నాడు. టీ20లీగ్‌ ఆరంభం నుంచి ఈ ఏడాది ముందు వరకూ చెన్నై ఆడిన అన్ని సీజన్లలో సారథిగా

Updated : 01 May 2022 09:07 IST

ముంబయి: చెన్నై పగ్గాలు మరోసారి మహేంద్ర సింగ్‌ ధోని చేతికే వచ్చాయి. జడేజా ఆ బాధ్యతలను వదులుకున్నాడు. టీ20లీగ్‌ ఆరంభం నుంచి ఈ ఏడాది ముందు వరకూ చెన్నై ఆడిన అన్ని సీజన్లలో సారథిగా ధోని వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ జట్టు భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఈ సీజన్‌కు ముందు అనూహ్యంగా కెప్టెన్‌గా తప్పుకున్న అతను.. ఆ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు. కానీ ఇప్పుడు కెప్టెన్సీకి జడ్డూ రాజీనామా చేయడంతో తిరిగి ధోనీనే జట్టును నడిపించనున్నాడు. జడేజా సారథ్యంలోని చెన్నై ఈ సీజన్‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు నమోదుచేసింది. మరోవైపు తన ప్రదర్శనపై నాయకత్వ భారం పడుతోందని జడ్డూ భావిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో అతను 112 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ‘‘తన ఆటపై మరింత దృష్టి సారించడం కోసం జడేజా కెప్టెన్సీ వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. చెన్నైను మళ్లీ నడిపించాలని ధోనీని కోరాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతను అంగీకరించాడు. జడ్డూ తన ప్రదర్శనపై ధ్యాస పెట్టాలని ధోని కోరుకుంటున్నాడు’’ అని చెన్నై శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సీజన్‌ కంటే ముందు సీనియర్‌ స్థాయిలో ఏ జట్టుకూ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం లేని జడేజా.. ఇప్పుడు సారథిగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని