Commonwealth Games: చలో.. బర్మింగ్‌హామ్‌

అక్కడ బర్మింగ్‌హామ్‌లో... 72 దేశాలు.. 5 వేల మందికి పైగా క్రీడాకారులు.. 20 క్రీడాంశాలు.. 12 రోజుల పాటు పోటీలే పోటీలు! ఇక్కడ మహాబలిపురంలో.. 180కి పైగా దేశాలు.. 1700 మందికి పైగా క్రీడాకారులు..  2 వారాల పాటు చదరంగ పోరాటాల హోరాహోరీ! క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు ఒకే రోజు రెండు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి.

Updated : 28 Jul 2022 21:03 IST

నేటి నుంచే కామన్వెల్త్‌ క్రీడలు
పతకాల వేటలో భారత అథ్లెట్లు
ఆరంభ వేడుకలు రాత్రి 11.30 నుంచి
బర్మింగ్‌హామ్‌

అక్కడ బర్మింగ్‌హామ్‌లో... 72 దేశాలు.. 5 వేల మందికి పైగా క్రీడాకారులు.. 20 క్రీడాంశాలు.. 12 రోజుల పాటు పోటీలే పోటీలు!
ఇక్కడ మహాబలిపురంలో.. 180కి పైగా దేశాలు.. 1700 మందికి పైగా క్రీడాకారులు..  2 వారాల పాటు చదరంగ పోరాటాల హోరాహోరీ!
క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు ఒకే రోజు రెండు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిస్తున్న 22వ కామన్వెల్త్‌ క్రీడలకు, భారత్‌ వేదికగా జరగబోతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌కు గురువారమే శ్రీకారం. తొలి రోజు అక్కడా, ఇక్కడా ఆరంభ వేడుకల సందడి కనువిందు చేయనుంది. తర్వాతి రోజు నుంచి క్రీడాకారులు కదన రంగంలోకి దిగి అమీతుమీ తేల్చుకోబోతున్నారు.
కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల సంఖ్య పెంచాలని అథ్లెట్లు పట్టుదలగా ఉండగా.. తొలిసారి సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపియాడ్‌లో పోడియంపై నిలవాలని చదరంగ క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు.

ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ క్రీడలు వచ్చేశాయ్‌. 12 రోజుల సందడి తెచ్చేశాయ్‌. గురువారం కేవలం ఆరంభ వేడుకలు మాత్రమే జరుగుతాయి. ఆ తర్వాత 11 రోజుల పాటు ఇక ఆటల పోరాటాలు.. అథ్లెట్ల పతక ఆరాటాలు.. అభిమానుల విజయ కేరింతలు.. ఇక క్రీడా వినోదం మరోస్థాయికి చేరనుంది. ఆగస్టు 8న ఇవి ముగుస్తాయి. 72 ఏళ్ల క్రితం 1930లో ఈ క్రీడలకు బీజం పడింది. మధ్యలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లో పోటీలు జరగలేవు. ఆ తర్వాత ప్రతి నాలుగేళ్లకోసారి క్రీడా ప్రేమికులను ఇవి అలరిస్తూనే ఉన్నాయి. ఈ క్రీడలకు ఇంగ్లాండ్‌ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1934, 2002లో ఈ దేశంలోనే క్రీడలు జరిగాయి. భారత్‌ ఒకే ఒక్కసారి (2010) ఈ క్రీడలను నిర్వహించింది. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. మరోసారి ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమైంది. 2018లో స్వదేశంలో జరిగిన క్రీడల్లో ఆ దేశమే అగ్రస్థానంలో నిలిచింది. అప్పుడు మూడో స్థానంలో నిలిచిన భారత్‌ కూడా పతకాల కోసం గట్టిగానే పోరాడనుంది.

ఇవీ కీలకం..: షూటింగ్‌ గైర్హాజరీలో భారత్‌ ప్రధానంగా వెయిట్‌లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఈ క్రీడల్లో పోటీపడే అథ్లెట్లపై భారీ అంచనాలున్నాయి. రెజ్లింగ్‌లో బరిలో దిగనున్న 12 మంది కూడా పతకాలు సాధించే సత్తా ఉన్నవాళ్లే. డిఫెండింగ్‌ ఛాంపియన్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా మరోసారి పసిడి అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. టోక్యో ఒలింపిక్‌ రజత విజేత మీరాబాయి చాను సారథ్యంలోని వెయిట్‌లిఫ్టింగ్‌ బృందం పతక వేటకు సిద్ధమైంది. రెండు సార్లు ఒలింపిక్స్‌ పతకం గెలిచిన పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేతలు కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌తో కూడిన బ్యాడ్మింటన్‌ బలగం కూడా బలంగానే ఉంది. గత కామన్వెల్త్‌ క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ మరోసారి అదే ప్రదర్శన రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో కూడిన బాక్సింగ్‌ విభాగమూ అంచనాలను అందుకోవాలనే ధ్యేయంతో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శన చేసిన హాకీ జట్లు.. అదే జోరు కొనసాగిస్తే పతకాలు గెలిచే ఆస్కారముంది. అథ్లెటిక్స్‌లోనూ కొన్ని మెరుపులు చూడొచ్చు. ఇక తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు భారత అమ్మాయిల జట్టు సై అంటోంది.

ముందే దెబ్బ..: కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో దేశానికి అత్యధిక పతకాలు తెచ్చిపెట్టిన షూటింగ్‌ను ఈ సారి నిర్వహించకపోవడం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పటివరకూ షూటింగ్‌లో దేశానికి 63 స్వర్ణాలు, 44 రజతాలు, 28 కాంస్యాలు కలిపి మొత్తం 135 పతకాలు వచ్చాయి. అవి అన్ని క్రీడల్లో కలిపితే వచ్చిన పతకాల్లో (503) 25 శాతం కంటే ఎక్కువ కావడం విశేషం. కానీ ఈ సారి షూటింగ్‌ లేకపోవడంతో పతకాల పట్టికలో భారత్‌ తొలి అయిదు స్థానాల్లోపు చోటు నిలబెట్టుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక జావెలిన్‌ త్రోలో కచ్చితంగా పతకం గెలుస్తాడనుకున్న నీరజ్‌ చోప్రా గాయంతో క్రీడలకు దూరమయ్యాడు. మరోవైపు ముగ్గురు అథ్లెట్లపై డోపింగ్‌ మచ్చ బృందాన్ని ఇబ్బందికి గురిచేసేదే.

కొత్త ఆటలు..: ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్‌, 3×3 బాస్కెట్‌బాల్‌, 3×3 వీల్‌చెయిర్‌ బాస్కెట్‌బాల్‌ను ప్రవేశపెడుతున్నారు. మొదటి సారి టేబుల్‌ టెన్నిస్‌లో పారా అథ్లెట్లు తలపడబోతున్నారు. గత క్రీడల్లో మాయమైన జూడో ఈ సారి తిరిగి వచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ నిర్వహణ దిశగా ఇప్పుడీ కామన్వెల్త్‌లో ప్రయోగాత్మకంగా అమ్మాయిల టీ20 టోర్నీ నిర్వహిస్తున్నారు.


పతాకధారి సింధు

కామన్వెల్త్‌ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి.సింధు, భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. తొలుత గాయపడి క్రీడలకు దూరమైన నీరజ్‌ చోప్రా స్థానంలో సింధును పతాకధారిగా భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) ప్రకటించింది. అయితే ప్రతి దేశం నుంచి పురుషుల నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరు పతాకధారిగా ఉండాలని నిర్వాహకులు చెప్పడంతో ఐవోఏ మన్‌ప్రీత్‌ పేరునూ చేర్చింది. గరిష్ఠంగా 164 మందితో కూడిన భారత బృందం ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లోనూ సింధు భారత    పతాకధారిగా వ్యవహరించింది.


మహిళలకే ఎక్కువ..

ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఈ కామన్వెల్త్‌ క్రీడలు ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. పురుషుల కంటే ఎక్కువగా మహిళలకు పతకాంశాలు నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ బహుళ క్రీడల పోటీలు ఇవే. అమ్మాయిలకు 136 స్వర్ణాలు అందనుండగా.. పురుషులకు ఆ సంఖ్య 134గా ఉంది. మిక్స్‌డ్‌ ఈవెంట్లలో మరో పది బంగారు పతకాలున్నాయి. అలాగే సాధారణ క్రీడలతో సమాంతరంగా పారా విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు.


భారత సైన్యం 215

18వ సారి కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీపడుతున్న భారత్‌ మరోసారి బలమైన అథ్లెట్ల బృందాన్ని బరిలో దించింది. 215 మంది అథ్లెట్లు.. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, హాకీ, జూడో, స్క్వాష్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, ట్రయథ్లాన్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లో పతకాల వేట సాగించనున్నారు.


20 క్రీడలు.. 280 పతకాంశాలు

ఈ సారి 15 వేదికల్లో 20 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అక్వాటిక్స్‌ (డైవింగ్‌, స్విమ్మింగ్‌), అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, 3×3 బాస్కెట్‌బాల్‌ (వీల్‌ చెయిర్‌ బాస్కెట్‌బాల్‌ కూడా), బీచ్‌ వాలీబాల్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, జూడో, లాన్‌ బౌల్స్‌, నెట్‌బాల్‌, పారా పవర్‌లిఫ్టింగ్‌, రగ్బీ సెవెన్స్‌, స్క్వాష్‌, టేబుల్‌ టెన్నిస్‌, ట్రయథ్లాన్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లో పోటీలుంటాయి. వీటన్నింటిలో కలిపి 280 పతకాంశాల్లో అథ్లెట్లు తలపడతారు.


దూరమవడం బాధగా ఉంది

కామన్వెల్త్‌ క్రీడలకు దూరమవడం బాధగా ఉందని భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా తెలిపాడు. ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో గజ్జల్లో గాయం కారణంగా అతను ఈ క్రీడల్లో పాల్గొనడం లేదు. 2018లో పసిడి నెగ్గిన నీరజ్‌.. ఈ సారి ఆ టైటిల్‌ను కాపాడుకోలేకపోతున్నాడు. ‘‘నా టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోతుండడంతో చాలా బాధగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే మరో అవకాశాన్ని కోల్పోయా. కామన్వెల్త్‌ ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా నిలిచే ఛాన్స్‌ పోగొట్టుకున్నందుకు ఇంకా నిరాశగా ఉంది. ఆ గౌరవం కోసం ఎదురు చూశా. ఇప్పటికైతే తిరిగి కోలుకోవడంపై దృష్టి సారిస్తా. అతి త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా. కొన్ని రోజులుగా నాకు మద్దతుగా నిలుస్తూ నాపై ప్రేమ చూపించిన దేశానికి ధన్యవాదాలు. బర్మింగ్‌హామ్‌లో మన అథ్లెట్లను ప్రోత్సహించాలని కోరుతున్నా’’ అని అతను సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నాడు.


ఉత్తమ ప్రదర్శనే లక్ష్యం

ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో మెరుగైన ఆటతీరుతో ఉత్తమ ప్రదర్శన చేయడమే తన లక్ష్యమని భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ చెప్పాడు. 2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో జోరు ప్రదర్శించిన అతను 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత తన ప్రదర్శన పడిపోయింది. మళ్లీ గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో అతను పుంజుకున్నట్లు కనిపిస్తున్నాడు. ‘‘ఇప్పుడు నేను మరింత అనుభవంతో, పరిణతితో ఉన్నా. నేనెప్పుడూ మెరుగైన ప్రదర్శనే ఇవ్వాలనుకుంటా. 2018 క్రీడల్లో మంచి లయ కలిగి ఉన్నా. ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతున్నా. ఈ కామన్వెల్త్‌ను ఆసియా క్రీడలు లేదా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌తో సమానంగా పరిగణిస్తా. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్లో గెలిచే పతకం దేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఏడాదిగా నిలకడగా ఆడుతున్నా. ఈ సారి ఉత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యం’’ అని అతను తెలిపాడు.


రాజేశ్‌ స్థానంలో అనాస్‌

దిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల ఆరంభానికి ఒక్క రోజు ముందు పురుషుల భారత 4×400మీ. రిలే జట్టులో మార్పు జరిగింది. గాయంతో ఇబ్బంది పడుతున్న రాజేశ్‌ రమేశ్‌ స్థానంలో మహమ్మద్‌ అనాస్‌ను ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) బుధవారం ప్రకటించింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడ్డ రిలే జట్టులో అనాస్‌ కూడా ఉన్నాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌ 17 మంది పురుషులు, 15 మంది మహిళలను బరిలో దింపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని