మేటి ఆటగాడు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

భారత అగ్రశ్రేణి హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు.

Published : 08 Oct 2022 01:46 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు. ఈ డిఫెండర్‌ పురుషుల విభాగంలో ‘ఎఫ్‌ఐహెచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు. 26 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌.. టియున్‌ డి నూజెర్‌ (నెదర్లాండ్స్‌), జేమీ డ్వైయర్‌ (ఆస్ట్రేలియా), ఆర్థర్‌ వాన్‌డొరెన్‌ (బెల్జియం)ల తర్వాత వరుసగా రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకున్న క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. ‘‘హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఆధునిక హాకీ సూపర్‌స్టార్‌గా తనను తాను మలచుకున్నాడు. సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉంటూ ప్రత్యర్థి జట్ల దాడులను విచ్ఛిన్నం చేసే నైపుణ్యం అతడికి ఉంది. తనకు గొప్ప డ్రిబ్లింగ్‌ నైపుణ్యాలున్నాయి. అలాగే తరచుగా గోల్స్‌ కొడుతుంటాడు. అందుకే అతడికి వరుసగా రెండో ఏడాది ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని కట్టబెట్టాం’’ అని ఎఫ్‌ఐహెచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. హర్మన్‌ప్రీత్‌కు ఓటింగ్‌లో అత్యధికంగా 29.4 పాయింట్లు రాగా.. థియెరీ బ్రింక్‌మన్‌ (నెదర్లాండ్స్‌), టామ్‌ బూన్‌ (బెల్జియం) వరుసగా 23.6, 23.4 పాయింట్లు సాధించారు. 2021-22 హాకీ ప్రొ లీగ్‌ సీజన్లో హర్మన్‌ప్రీత్‌ 16 మ్యాచ్‌లాడి 18 గోల్స్‌ చేశాడు. మహిళల్లో నెదర్లాండ్స్‌ క్రీడాకారిణి ఫెలిస్‌ ఆల్బర్స్‌ ఈ అవార్డును గెలుచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని