శెభాష్‌ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్‌

టీమిండియా యువ పేసర్‌ నటరాజన్‌పై స్టార్ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. నట్టూ వ్యక్తిత్వం గొప్పదని, అత్యుత్తమ స్థాయి‌లో సత్తాచాటాలని కసిగా...

Published : 17 Jan 2021 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా యువ పేసర్‌ నటరాజన్‌పై స్టార్ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. నట్టూ వ్యక్తిత్వం గొప్పదని, అత్యుత్తమ స్థాయి‌లో సత్తాచాటాలని కసిగా ప్రయత్నిస్తున్నాడని కొనియాడాడు. బ్రిస్బేన్‌ వేదికగా భారత్×ఆసీస్‌ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసిన అనంతరం హిట్‌మ్యాన్ మీడియాతో మాట్లాడాడు.

‘‘నటరాజన్‌ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. విదేశాల్లో మొదటిసారిగా క్రికెట్ ఆడటమంటే అంత సులువు కాదు. అంతేగాక ఆసీస్‌ వంటి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ అంటే ఆషామాషీ కాదు. అయినా అతడిపై కాస్త కూడా ఒత్తిడి లేదు. తొలి బంతి నుంచి అతడి ప్రదర్శన ఒకేలా ఉంది. తన దృఢమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు. జట్టు కోసం, తన కోసం గొప్పగా పోరాడాలని చూస్తున్నాడు. అందుకే ఆసీస్‌లో ఉన్నాడు’’ అని రోహిత్ పేర్కొన్నాడు.

ఆసీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టుతో నట్టూ తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే నటరాజన్‌ నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. కానీ ఆటగాళ్ల గైర్హాజరీతో అవకాశం దక్కించుకున్నాడు. చక్కని ప్రదర్శనతో భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లో ఆడాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

సీనియర్‌ బౌలర్ల గైర్హాజరీలో టీమిండియా యువ బౌలర్లతో గబ్బా టెస్టులో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే అనుభవం లేకపోయినా యువ బౌలర్లు ఆకట్టుకున్నారని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత యువ బౌలర్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియాలో తొలిసారిగా ఆడుతున్నారు. మెల్‌బోర్న్‌ టెస్టులో సిరాజ్‌, సిడ్నీ టెస్టులో సైని అరంగేట్రం చేశారు. వాళ్లకి అనుభవం లేదు. అయినా ఎంతో క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తున్నారు. మంచి వికెట్‌పై అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడం గొప్ప అనుభవం. తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక శార్దూల్ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడికి మంచి భవిష్యత్ ఉంది. వాళ్ల నేపథ్యమే.. కసిగా ప్రదర్శన చేసేలా ప్రేరణ ఇస్తోంది’’ అని తెలిపాడు.

ఇదీ చదవండి

యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌

పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని