Virat - Gambhir: గంభీర్‌ ఇప్పుడేమీ ఆడటం లేదు కదా.. దూరంగా ఉంటే ఉత్తమం: వాట్సన్

ఇద్దరు స్టార్ల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గా కొనసాగుతోంది. మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే కీలక సూచనలు చేస్తున్నారు.

Published : 06 May 2023 11:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదు రోజుల కిందట జరిగిన విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్‌ (Virat Kohli - Gautam Gambhir) వివాదంపై సర్వత్రా చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) వీరిద్దరి వ్యవహారమే హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ సహాయక కోచ్ షేన్ వాట్సన్ కూడా స్పందించాడు. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో దిల్లీ తలపడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో వాట్సన్ మాట్లాడాడు. క్రికెటర్లు ఎవరైనా సరే మైదానం వెలుపల మంచి సంబంధాలను కలిగి ఉండాలని సూచించాడు. గేమ్‌లో విజయం కోసం చివరి వరకూ జరిగే పోరాటం బాగుండాలని, అయితే మ్యాచ్‌ ముగిశాక మాత్రం కలిసిపోవాలని పేర్కొన్నాడు. 

‘‘ఆన్‌ ఫీల్డ్‌లో విజయం కోసం ఇరు జట్లూ పోరాడాలి. ఎలాంటి వాగ్వాదమైనా, గొడవలైనా సరే అక్కడితోనే ఆగిపోవాలి. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడానికి సరైన వేదిక మైదానమే. అయితే, మ్యాచ్‌ ముగిసి బెయిల్స్‌ కింద పడగానే అన్నింటినీ వదిలేయాలి. అంతేకానీ వాగ్వాదాలకు పోకూడదు. గౌతమ్ గంభీర్ - విరాట్ కోహ్లీల మధ్య ఏం జరిగిందో తెలియట్లేదు. ఇలాంటి సంఘటనలను చూడాలని ఎవరూ అనుకోరు. గౌతమ్‌ గంభీర్‌ కూడా మ్యాచ్‌లోనూ ఆడటం లేదు. అలాంటప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బాగుండేది’’ అని వాట్సన్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్‌ అయితే కాస్త ఘాటుగానే గంభీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచింగ్‌ సిబ్బంది ఎప్పుడూ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పాడు. ఆటగాళ్ల మధ్య సంవాదాలు సహజమేనని,  కోచ్‌లు మాత్రం కలగజేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని