IND vs BAN: భారత్‌తో తొలి వన్డే.. కీలక బౌలర్‌ను కోల్పోయిన బంగ్లా జట్టు

భారత్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ టస్కిన్‌ అహ్మద్‌ దూరమయ్యాడు.

Published : 01 Dec 2022 18:59 IST

ధాకా: భారత్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ టస్కిన్‌ అహ్మద్‌ దూరమయ్యాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో కొనసాగుతున్న ఈ ఆటగాడు ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే వెన్ను గాయం కారణంగా టస్కిన్‌ తొలి మ్యాచ్‌లో  పాల్గొనలేకపోతున్నాడని బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ)గురువారం వెల్లడించింది. అతడి స్థానంలో షోరిఫుల్‌ ఇస్లాంను జట్టులోకి తీసుకోనున్నట్టుగా తెలిపింది. టస్కిన్‌ రైట్‌ హ్యాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌గా, లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా జట్టులో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 

ఇటీవల వార్మప్‌ మ్యాచ్‌ సమయంలో గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మరో ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ సైతం ఇప్పట్లో తిరిగి జట్టులో చేరే అవకాశాలు కనిపించడం లేదు. డిసెంబర్‌ 4న ధాకా వేదికగా ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కి ఇప్పటికే ఇరు జట్లు తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. 
న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌ కెప్టెన్లుగా టీమ్‌ఇండియాను నడిపించిన విషయం తెలిసిందే. రానున్న బంగ్లా సిరీస్‌తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్ తిరిగి రానున్నారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ ముంగిట ఇరు జట్లకు ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని