Tokyo Olympics: అబ్బాయిల బాటలోనే..! హాకీ సెమీస్‌లో 1-2 తేడాతో ఓడిన రాణి రాంపాల్‌ సేన

అమ్మాయిలు.. అబ్బాయిల బాటలోనే నడిచారు! ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశం చేజార్చుకున్నారు. ప్రపంచ నంబర్‌వన్‌ అర్జెంటీనాపై పోరాడి ఓడారు....

Updated : 04 Aug 2021 17:29 IST

ఇక కాంస్య కోసమే భారత్‌ పోరాటం

టోక్యో: అమ్మాయిలు.. అబ్బాయిల బాటలోనే నడిచారు! ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశం చేజార్చుకున్నారు. ప్రపంచ నంబర్‌వన్‌ అర్జెంటీనాపై పోరాడి ఓడారు. ఇక కాంస్య పోరుపైనే వారి ఆశలన్నీ! కీలకమైన సెమీస్‌లో రాణి రాంపాల్‌ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా.. ప్రత్యర్థి జట్టు తమ అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. భారత్‌ నుంచి గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేయగా అర్జెంటీనాలో మరియా నోయెల్‌ 2 గోల్స్‌ చేసింది.

మొదటి గోల్‌ మనదే

ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే టీమ్‌ఇండియా గోల్‌ చేసింది. పెనాల్టీ కార్నర్‌ను గుర్జిత్‌ కౌర్‌ సద్వినియోగం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి క్వార్టర్‌ను 1-0తో ముగించింది రాంపాల్‌ సేన. ఈ క్రమంలో టీమ్‌ఇండియా చేసిన కొన్ని పొరపాట్లు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. 18వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను ప్రత్యర్థి సారథి మరియా నోయెల్‌ గోల్‌గా మలిచింది. దాంతో 1-1తో రెండో క్వార్టర్‌ ముగిసింది.

అర్జెంటీనా కెప్టెన్‌ అద్భుతం

మూడో క్వార్టర్లో రాణి జట్టు గోల్‌ చేసేందుకు విపరీతంగా శ్రమించింది. అయితే అర్జెంటీనా భారత గోల్‌ పోస్ట్‌పై దాడులు చేసి ఒత్తిడి పెంచింది. పదేపదే వృత్తం వద్దకు చేరుకోవడంతో 36వ నిమిషంలో వారికి పెనాల్టీ కార్నర్‌ లభించింది. మరియా ప్రమాదకరంగా ఆడుతూ దానిని గోల్‌గా మలిచింది. గోల్‌కీపర్‌ సవిత దానిని అడ్డుకోలేక పోయింది. 2-1తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఆఖరి క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు రాణి సేన ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అయ్యాయి. ఎట్టకేలకు ఒక పీసీ భారత్‌కు వచ్చినా ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ దానిని మరియా బెలెన్ దానిని అడ్డుకుంది. ఆట అర నిమిషంలో ముగుస్తుందనగా వచ్చిన ఫ్రీహిట్‌ను గోల్‌ చేసేందుకు టీమ్‌ఇండియా ప్రయత్నిస్తే మళ్లీ బెలెన్‌ కిందపడి మరీ ఆపేయడంతో భారత్‌ ఆశలు అడియాసలు అయ్యాయి.

అర్జెంటీనా ఆరు పెనాల్టీ కార్నర్లలో 2 గోల్స్‌ చేయగా భారత్‌కు వచ్చిన 3 పీసీల్లో రెండింటిని ప్రత్యర్థి విజయవంతంగా అడ్డుకొంది. పురుషుల జట్టు సైతం బెల్జియంకు విపరీతమైన పీసీలు ఇవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని