మూడు రనౌట్లా? అది కూడా టెస్టు‌ల్లోనా!

సుదీర్ఘ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలంటే బౌలర్లు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. వన్డే, టీ20ల్లో వేగంగా పరుగులు సాధించాలనే తొందరలో బ్యాట్స్‌మెన్‌ చేసే తప్పిదాలను ఉపయోగించుకుని బోల్తాకొట్టిస్తుంటారు...

Published : 09 Jan 2021 20:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలంటే బౌలర్లు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. వన్డే, టీ20ల్లో అయితే.. వేగంగా పరుగులు సాధించాలనే తొందరలో బ్యాట్స్‌మెన్‌ చేసే తప్పిదాలను ఉపయోగించుకుని కాస్త సులువుగా బోల్తా కొట్టిస్తుంటారు. కానీ, టెస్టుల్లో వికెట్‌ను కాపాడుకోవడానికే బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి టెస్టులో వికెట్లు దక్కాలంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కంటే బౌలర్లు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అందుకే బ్యాట్స్‌మెన్‌తో తప్పులు చేయించేలా ప్రణాళికతో బంతులు వేస్తుంటారు.

ఇక టెస్టుల్లో రనౌట్‌ అయ్యే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌ అవుతుంటారు. కానీ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఏకంగా ముగ్గురు ఔటవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆతిథ్య జట్టుకు ఉచితంగా వికెట్లు సమర్పించుకున్నారని విశ్లేషకులు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్‌ సిరీస్‌లో అయిదుగురు భారత బ్యాట్స్‌మన్‌ రనౌటవ్వడం గమనార్హం. తొలి టెస్టులో కోహ్లీ, రెండో టెస్టులో రహానె ఔటవ్వగా.. సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా రనౌటయ్యారు.

ఒక టెస్టు సిరీస్‌లో భారత టాప్‌-8 బ్యాట్స్‌మెన్‌లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది రనౌటవ్వడం 1989 తర్వాత ఇదే తొలిసారి. 1989/90 పాకిస్థాన్‌ పర్యటనలో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడింది. దీనిలో మంజ్రేకర్‌, అజారుద్దీన్‌, నవ్‌జోత్‌ సిద్ధు, ప్రభాకర్‌, సచిన్‌ తెందుల్కర్‌ రనౌటయ్యారు. కాగా, ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలోనూ టాప్‌-8 బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ, రహానె, విహారి, అశ్విన్‌ ఔటవ్వడం గమనార్హం.

ఇక ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ముగ్గురు అంతకంటే ఎక్కువ భారత ఆటగాళ్లు రనౌటవ్వడం ఇది ఏడో సారి. చివరిగా 2008లో మొహాలి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, యువరాజ్‌ సింగ్ రనౌటయ్యారు. కాగా, సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ అనవసర తప్పిదాలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు కుప్పకూలింది. భారీ స్కోరు సాధించే అవకాశం ఉన్నా రనౌట్లతో సాధించలేకపోయింది. మొత్తంగా శనివారం ఆట ముగిసేసమయానికి ఆసీస్‌ 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చదవండి

టీమిండియా ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు

మూడో టెస్టుపై పట్టుబిగించిన ఆసీస్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని