IND vs SA: రోహిత్‌ను విరాట్ అధిగమిస్తాడా..? రికార్డును ఖాతాలో వేసుకొంటాడా..?

ఆసీస్‌తో సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్‌ ముగింట భారత్‌ ఆడే చివరి టీ20 సిరీస్‌ కూడా..

Updated : 28 Sep 2022 18:18 IST

మరికాసేపట్లో దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తొలి టీ20

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసీస్‌తో సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్‌ 2022 ముంగిట భారత్‌ ఆడే చివరి టీ20 సిరీస్‌ కూడా ఇదే కావడం విశేషం. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తిరువనంతపురం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో ఓ రికార్డు కోసం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మతో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ పోటీపడనున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటారా..? అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా అవతరించే అవకాశం విరాట్ కోహ్లీ ముందుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ 139 మ్యాచుల్లో 4 శతకాలు, 28 అర్ధశతకాలతో 3,694 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 107 మ్యాచుల్లోనే ఒక శతకం, 33 అర్ధశతకాలతో 3,660 పరుగులతో రెండు స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,497 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఇంకో 35 పరుగులు చేస్తే రోహిత్‌ను అధిగమిస్తాడు. రోహిత్ కూడా దూకుడుగా ఆడి తన ర్యాంక్‌ను సుస్థిరం చేసుకుంటాడన్న విషయం తెలియాలంటే వేచి చూడాలి. 

శ్రేయస్‌కు అవకాశం

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నుంచి దీపక్ హుడా గాయం కారణంగా వైదొలిగాడు. అలాగే శ్రేయస్‌ అయ్యర్, షాహబాజ్‌ అహ్మద్, ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌ నుంచి దీపక్‌ హుడా వైదొలిగాడు. వెన్నునొప్పి కారణంగా జాతీయ క్రికెట్‌ అకాడమీలో విశ్రాంతి తీసుకొంటాడు. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌ కూడా రెస్ట్‌ తీసుకుంటారు. మహమ్మద్‌ షమీకి కరోనా నెగిటివ్‌ వచ్చినా కాస్త వీక్‌నెస్‌గా ఉండటంతో జట్టుతో కలవడు. అయితే అర్ష్‌దీప్‌ సింగ్‌ వచ్చేశాడు. అతడితోపాటు శ్రేయస్ అయ్యర్, షహబాజ్‌ అహ్మద్, ఉమేశ్‌ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించాం’’ అని బీసీసీఐ వెల్లడించింది. 

భారత జట్టు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, హర్షల్‌ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, షహబాబ్‌ అహ్మద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని