
Kohli Vs Toss: మళ్లీ టాస్ లాస్... విరాట్తో కాయిన్ బంతాట..!
ఇంటర్నెట్ డెస్క్: టాస్.. ఒక మ్యాచ్లో ఏ జట్టు ముందు బ్యాటింగ్కు రావాలి.. ఏ జట్టు ఫీల్డింగ్కు రావాలో నిర్దేశించేది మాత్రమే. కానీ, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో మాత్రం.. టాసే కీలకంగా మారింది. ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం.. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఓటమి చవిచూడడం జరుగుతోంది. సూపర్- 12లో భాగంగా జరిగిన చాలా వరకు మ్యాచుల్లో టాస్ గెలుపొందిన జట్లకు టాస్ ఫేవర్ చేసిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ టోర్నీలో పాక్, న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్ టాస్ ఓడిపోవడం గమనార్హం. ఈ రెండుసార్లూ భారతే తొలుత బ్యాటింగ్ చేసింది. ఫలితం మాట అటుంచితే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం టాస్ ఎప్పుడూ కలిసి రాలేదన్నది జగమెరిగిన సత్యం. బుధవారం జరిగిన అఫ్గాన్ మ్యాచ్లో సైతం కోహ్లీ టాస్ ఓడిపోవడంతో సోషల్మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. బ్యాటింగ్లో కుదరుకోవాలే గానీ బౌలర్లను చండాడే కోహ్లీని.. ఓ ఆట ఆడుకుంటున్న టాస్ గురించి ఓ లుక్కేద్దాం..
గాల్లోకి ఎగిరే కాయిన్ కారణంగా కోహ్లీని ఇక్కడ నిందించాల్సిన అవసరం లేదు. అయితే, టాస్ గెలిచే విషయంలో 50/50 అవకాశాలుంటాయన్నది విశ్లేషకుల మాట. ఈ విషయంలో విరాట్ కొంచెం వెనుకంజలో ఉన్నాడనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్లో భాగంగా మూడు మ్యాచుల్లోనూ విరాట్ టాస్ ఓడిపోవడమే ఇందుకు ఉదాహరణ.
ఇదొక్కటే కాదు.. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచుల్లో 12 సార్లు టాస్ వేస్తే 10 సార్లు విరాట్ టాస్ ఓడిపోయాడు. ఇప్పటి వరకు 63 టెస్టుల్లో 27 సార్లు మాత్రమే కోహ్లీ టాస్ గెలిచాడు. గెలుపోటముల నిష్పత్తి 0.75 అన్నమాట. వన్డేల విషయానికొస్తే 95 సార్లు టాస్ వేస్తే గెలిచింది 40 మాత్రమే. గెలుపోటముల నిష్పత్తి 0.72. టీమ్ ఇండియా కెప్టెన్లతో పోల్చినప్పుడు ఈ విషయంలో విరాటే చివరి స్థానంలో ఉన్నాడు. అజారుద్దీన్, కపిల్ దేవ్ విషయంలో మాత్రమే గెలుపోటముల నిష్పత్తి 1 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంతకుముందు టీమ్ ఇండియాకు సారథ్యం వహించిన ధోనీ (0.91), గంగూలీ (0.95) సైతం టాస్ విషయంలో విరాట్ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. అయినా ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో సార్లు జట్టును విజయతీరాలకు చేర్చిన కోహ్లీకి మాత్రం టాస్ కలిసి రావడం లేదెందుకో??
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.