5G Network: 5జీ నెట్‌వర్క్‌తో సైబర్‌ నేరాల ముప్పు.. ఐపీఎస్‌ అధికారుల నివేదికలో వెల్లడి!

5జీ నెట్‌వర్క్‌తో వేగవంతమైన నెట్‌వర్క్‌ ఆధారిత సేవల్లో వేగం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతుంటే.. సైబర్‌, ఆర్థికపరమై నేరాలకు పాల్పడే వారికి ఇది వేదికగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 25 Mar 2023 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌ (5G Network) సేవలు గతేడాది చివర్లో ప్రారంభమయ్యాయి.  దీంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ సేవలను విస్తరిస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్‌తో వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలతోపాటు ఇతర నెట్‌వర్క్‌ ఆధారిత సేవల్లో వేగం పెరుగుతుందని.. డిజిటల్‌ ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు స్మగ్లర్లు, ఆర్థికపరమైన నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు ఇది వేదికగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పలువురు ఐపీఎస్‌ అధికారులు (IPS Officers) దిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సమావేశంలో 5జీ నెట్‌వర్క్‌పై ఒక నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ పాల్గొన్నారు. ఇంతకీ ఐపీఎస్‌ అధికారులు 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి ఏయే అంశాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారో చూద్దాం.  

  • 5జీ నెట్‌వర్క్‌ సాయంతో హెచ్‌టీటీపీ (HTTP), ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌ సెక్యూరిటీ (TLS) వంటి ఇంటర్నెట్‌ ప్రోటోకాల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు సులభంగా యాక్సెస్‌ చేసి వాటి సాంకేతిక వ్యవస్థలలోకి మాల్‌వేర్‌ను పంపి సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 
  • క్రిప్టో కరెన్సీ లేదా బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో 5జీ నెట్‌వర్క్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు సందర్భాల్లో సైబర్‌ నేరాలు జరిగిన తీరును గుర్తించడం సంక్లిష్టంగా మారుతుందని తెలిపారు. 
  • మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ మానవ రవాణా, మనీలాండరింగ్‌, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ మధ్య సమాచార మార్పిడికి 5జీ నెట్‌వర్క్‌లోని భద్రత వ్యవస్థ వేదికగా మార్చుకునే అవకాశం ఉందని ఐపీఎస్‌ అధికారులు ఆందోళన వ్మక్తం చేశారు. 
  • 5జీ నెట్‌వర్క్‌లోని నెట్‌వర్క్‌ ఫంక్షన్‌ వర్చువలైజేషన్‌ (NFV) కారణంగా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత వివరాల్లో ఫోన్‌ నంబర్లను మార్చి.. యూజర్ల బ్యాంకింగ్‌తోపాటు మొబైల్‌ ఆధారిత సేవలను తమ ఆధీనంలోకి తీసుకోగలరని నివేదికలో పేర్కొన్నారు. 
  • 5జీ నెట్‌వర్క్‌ ఎన్నో రకాల ఏఐ ఆధారిత ఇంటర్నెట్‌ ఆఫ్‌ దింగ్స్‌ (IOT)ను సపోర్ట్  చేస్తుండటంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌, సేవల్లో అంతరాయం కలిగించడం, బ్యాటరీ ఛార్జింగ్ తగ్గించడం, సేవలను నెమ్మదింపజేయడం, మాల్‌వేర్ ప్రవేశపెట్టడం, సీఎన్‌సీ క్రియేషన్‌, డీఎన్‌ఎస్‌ స్పూఫింగ్ వంటి వాటిని సైబర్‌ నేరగాళ్లు సులభంగా చేయగలరని తెలిపారు. 
  • 5జీ నెట్‌వర్క్‌ సంస్థలు యూజర్ల విలువైన సమాచారాన్ని అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థలకు అమ్మే సందర్భంలో అవి సంఘవిద్రోహులకు చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 5జీ నెట్‌వర్క్‌ ద్వారా వినియోగదారులకు అందుతున్న సేవలకు పూర్తిస్థాయిలో సైబర్‌ భద్రతను అందించడం ఎంతో కీలకమని నివేదికలో వెల్లడించారు. ఐవోటీ భద్రత గురించి ఎప్పటికప్పుడు యూజర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. 
  • 5జీ నెట్‌వర్క్‌ ఆపరేటర్లు హైబ్రిడ్‌ క్లౌడ్‌ విధానాన్ని అనుసరించి.. సున్నితమైన డేటాను లోకల్‌ సర్వర్లలో, సాధారణ డేటాను క్లౌడ్‌లో భద్రపరచాలని సూచించారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు నెట్‌వర్క్ సరఫరా కోసం ఉపయోగించే విడిభాగాలను నమ్మకమైన సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని కోరారు. దాని వల్ల చైనా వంటి దేశాలకు భారత్‌లోని ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న సున్నితమైన సమాచారాన్ని సేకరించడం కష్టంగా మారుతుందని తెలిపారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు