iPhone: ఛార్జర్‌ ఇవ్వడంలేదని ఆ దేశంలో ఐఫోన్‌లు సీజ్‌!

కొత్త ఐఫోన్‌తో పాటు ఛార్జర్‌ ఇవ్వడంలేదని బ్రెజిల్‌లోని యాపిల్‌ స్టోర్లలోని కొత్త ఐఫోన్లను అక్కడి ప్రభుత్వం సీజ్‌ చేసింది. ఛార్జింగ్ అడాప్టర్‌ ఇస్తేనే ఐఫోన్ విక్రయాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.

Published : 25 Nov 2022 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది కాలంగా యాపిల్‌ కంపెనీ కొత్త ఐఫోన్‌తోపాటు ఛార్జింగ్ అడాప్టర్‌ను ఇవ్వడంలేదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ చెబుతోంది. తాజాగా యాపిల్‌ బాటలోనే శాంసంగ్, ఒప్పో, వన్‌ప్లస్‌ వంటి కంపెనీలూ ఛార్జర్‌ అడాప్టర్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీన్ని కొన్ని దేశాలు స్వాగతించగా.. మరికొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఛార్జర్‌ అడాప్టర్‌ ఇవ్వకుండా మొబైల్‌ కంపెనీలు వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయంటూ విమర్శిస్తున్నాయి. 

ఈ విషయంలో యాపిల్‌ కంపెనీకి బ్రెజిల్‌ ప్రభుత్వం పలుమార్లు భారీగా జరిమానాలు విధించింది. కానీ, యాపిల్ మాత్రం ఛార్జింగ్ అడాప్టర్‌ ఇవ్వకుండానే ఐఫోన్ విక్రయాలు కొనసాగిస్తోంది. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం ‘ఆపరేషన్‌ డిశ్ఛార్జ్‌’ పేరుతో దేశవ్యాప్తంగా యాపిల్‌ స్టోర్లు, ఇతర రిటైలర్ల వద్ద ఉన్న కొత్త ఐఫోన్‌ మోడల్స్‌ను సీజ్‌ చేసింది. ఈ పరిణామంతో యాపిల్ కంపెనీ (బ్రెజిల్‌ శాఖ) ఐఫోన్‌లను విక్రయించేందుకు అనుమతించాలని బ్రెజిల్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. కానీ, బ్రెజిల్‌ ప్రభుత్వం మాత్రం ఛార్జర్‌ అడాప్టర్‌ లేకుండా ఐఫోన్ అమ్మకాలు జరపకూడదని, ఫోన్ పనిచేసేందుకు అది తప్పనిసరని పేర్కొంది.

బ్రెజిల్‌ ప్రభుత్వం ఛార్జింగ్ అడాప్టర్‌ ఇవ్వడంలేదని యాపిల్‌కు సెప్టెంబరులో 2.5 మిలియన్‌ డాలర్లు, అక్టోబరులో 100 మిలియన్‌ డాలర్లు జరిమానా విధించింది. యాపిల్ కంపెనీ 2020లో విడుదల చేసిన ఐఫోన్ 12 మోడల్‌ నుంచి ఛార్జింగ్ అడాప్టర్‌ను ఇవ్వడంలేదు. యూజర్లు తమ పాత ఫోన్లకు ఉండే అడాప్టర్లను ఐఫోన్‌కు ఉపయోగించుకోవాలని యాపిల్‌ సూచించింది. దీనివల్ల ఈ-వ్యర్థాలు తగ్గుతాయని తెలిపింది. ఒకవేళ యూజర్‌ కొత్త ఛార్జింగ్‌ అడాప్టర్‌ కావాలనుకుంటే అదనపు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందే.

ఈ నేపథ్యంలో మొబైల్‌ కంపెనీలు అన్ని ఒకే తరహా ఛార్జింగ్ పోర్ట్‌ను ఇవ్వాలని భారత్‌ సహా యూరోపియన్‌ యూనియన్‌లోని పలు దేశాలు కోరాయి. అందుకు మొబైల్‌ తయారీ కంపెనీలు సైతం అంగీకరించాయి. ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా పేరుకుంటున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని ఆయా దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు భావిస్తున్నాయి. కానీ, బ్రెజిల్‌ మాత్రం ఛార్జర్‌ అడాప్టర్‌ లేకుండా ఫోన్‌ విక్రయించకూడదని నిబంధన విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని