టచ్‌ స్క్రీన్‌ మాయ!

ఒకప్పుడు కంప్యూటర్లు పనిచేయాలంటే రంధ్రాలతో కూడిన కార్డులను ఉపయోగించాల్సి వచ్చేది. అదృష్టం కొద్దీ కీబోర్డు, మౌజ్‌లు రావటంతో ఆ శ్రమ తప్పిపోయింది. అసలు విప్లవం టచ్‌ స్క్రీన్‌ పరిజ్ఞానం వచ్చాకే మొదలైంది. కేవలం తెరను తాకటంతోనే బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయటం, యాప్‌లో షాపింగ్‌ చేయటం వంటి పనులన్నీ తేలికైపోయాయి.

Published : 26 Oct 2022 00:16 IST

ఒకప్పుడు కంప్యూటర్లు పనిచేయాలంటే రంధ్రాలతో కూడిన కార్డులను ఉపయోగించాల్సి వచ్చేది. అదృష్టం కొద్దీ కీబోర్డు, మౌజ్‌లు రావటంతో ఆ శ్రమ తప్పిపోయింది. అసలు విప్లవం టచ్‌ స్క్రీన్‌ పరిజ్ఞానం వచ్చాకే మొదలైంది. కేవలం తెరను తాకటంతోనే బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయటం, యాప్‌లో షాపింగ్‌ చేయటం వంటి పనులన్నీ తేలికైపోయాయి. ఏదైనా బొమ్మను, టెక్స్ట్‌ను పెద్దగా చూడాలనుకున్నా, చిన్నగా చేయాలనుకున్నా జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌ చేస్తే చాలు. సమాచారాన్ని తెలుసుకోవటం, వినోదం పొందటం.. ఏదైనా గానీ ఇలా చిన్న ట్యాప్‌తోనే పూర్తవుతుంది. ఇంతకీ ఈ టచ్‌ స్క్రీన్‌ ఎలా పనిచేస్తుంది? లైట్‌-ఎమిటింగ్‌ డయోడ్‌ (ఎల్‌ఈడీ) సాయంతో పనిచేసే ఇది ఇలా తాకినంతనే మనం అనుకున్నట్టుగా ఎలా నడచుకుంటుంది? చేతికి గ్లవుజులు ధరించినప్పుడు ఎందుకు స్పందించదు?

కీబోర్డుల గురించి తెలిసిందే. వీటి మీటలను ఒకరకంగా విద్యుత్‌ స్విచ్చులని అనుకోవచ్చు. మీటను నొక్కినప్పుడు విద్యుత్‌ సర్క్యూట్‌ పూర్తయ్యి, దానికి సంబంధించిన పనులు (ఉదా: టైపింగ్‌) జరిగిపోతాయి. టచ్‌ స్క్రీన్‌లు సైతం ఇలాగే పనిచేస్తాయి. వీటిని తెర మీదుండే అదృశ్య కీబోర్డులని చెప్పుకోవచు. ఇప్పుడు ఎక్కువగా రెసిస్టివ్‌ రకం టచ్‌ స్క్రీన్లను వాడుతున్నారు. ఇది సరళమైన పరిజ్ఞానం. కాస్త నొక్కితే తెర వంగుతుంది. మరోవైపు ఇది వేలి బలాన్నీ నిలువరిస్తుంటుంది. రెసిస్టివ్‌ టచ్‌స్క్రీన్‌లో విద్యుత్‌ ప్రసారానికి వీలుకల్పించే రెండు పొరలుంటాయి. వీటిని విడదీస్తూ మధ్యలో స్పేసర్లు ఉంటాయి. మనం వేలితో తెరను తాకేంతవరకు ఇవి పొరలు కలవకుండా చూస్తాయి. అంటే అప్పటివరకూ వీటి మధ్య విద్యుత్‌ ప్రవహించదన్నమాట. ఒకసారి వేలితో తెరను తాకగానే పొరలు కలిసిపోతాయి. అప్పుడు విద్యుత్‌  ప్రసరణ జరిగి, అక్కడ మార్పులు జరుగుతాయి. పరికరంలోని సాఫ్ట్‌వేర్‌ ఈ మార్పులను గుర్తించి, మనం ఎక్కడ తాకామనేది తెలుసుకుంటుంది. అప్పుడు కీబోర్డు మీటలాగా పనిచేయిస్తుంది. సార్ట్‌ఫోన్లే కాదు, ఏటీఎంలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ పరికరం తెరల వంటివన్నీ రెసిస్టివ్‌ రకం టచ్‌ స్క్రీన్‌ పరిజ్ఞానంతో కూడుకున్నవే. ఇందులో సాధారణంగా ఇండియం టిన్‌ ఆక్సైడ్‌ అనే విద్యుత్‌ వాహక పదార్థాన్ని తెర మీద అతి పలుచటి పొరగా పరుస్తారు. ఇది పారదర్శకంగా ఉంటుంది మరి. అందుకే పైకేమీ తెలియదు.

గ్లవుజులు ధరిస్తే ఎందుకు పనిచేయదు?

మరి గ్లవుజులు ధరించినప్పుడు ఇది ఎందుకు పనిచేయదు? గ్లవుజులను విద్యుత్‌ నిరోధక పదార్థంతో తయారుచేస్తారు. అందువల్ల వీటితో తాకినా తెరలో విద్యుత్‌ ప్రసారంలో ఎలాంటి మార్పులు జరగవు. కాబట్టి స్పందించవు. ఇప్పుడు విద్యుత్‌ ప్రసారమయ్యేలా చూసే ప్రత్యేక గ్లవుజులనూ తయారుచేస్తున్నారు.

మరెన్నో రకాలు

ఒక్క రెసిస్టివ్‌ టచ్‌ స్క్రీన్లు మాత్రమే కాదు.. ఇంకా చాలానే ఉన్నాయి. వివిధ గాజు పొరలతో తయారు చేసే కెపాసిటివ్‌, పరారుణ కాంతి పరిజ్ఞానంతో కూడిన ఇన్‌ఫ్రారెడ్‌, శబ్ద తరంగాలతో పనిచేసే సర్ఫేస్‌ అకౌస్టిక్‌ వేవ్‌, విద్యుదయస్కాంత క్షేత్రంతో స్పందించే నియర్‌ ఫీల్డ్‌ ఇమేజింగ్‌ పరిజ్ఞానాలతో కూడిన తెరలూ వాడకంలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని