TS News: బదిలీల్లేవు.. పదోన్నతులు రావు

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కలగానే మిగిలిపోతోంది. చిరకాల డిమాండ్లకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సర్కారు హామీలు నెరవేరడం లేదు. సాక్షాత్తూ శాసనసభలో చేసిన ప్రకటనలూ కార్యరూపం దాల్చడం లేదు.

Updated : 19 Jul 2021 09:41 IST

 ఆరేళ్లుగా సమస్యల్లో ఉపాధ్యాయులు

జీవోలు ఇచ్చిన వాటికీ మోక్షం లేదు

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కలగానే మిగిలిపోతోంది. చిరకాల డిమాండ్లకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సర్కారు హామీలు నెరవేరడం లేదు. సాక్షాత్తూ శాసనసభలో చేసిన ప్రకటనలూ కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా టీచర్లకేకాక.. సర్కారు పాఠశాలల్లో విద్యనభ్యసించే లక్షలాది మంది పేద పిల్లలకూ నష్టం వాటిల్లుతోంది. పదోన్నతులు దక్కని కారణంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతతో నాణ్యమైన బోధన అందని ద్రాక్షగా మారుతోంది. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది 1-10 తరగతుల విద్యార్థులుంటే అందులో సుమారు 25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 27 వేల బడులుండగా.. 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గత అయిదారేళ్లుగా పలు ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేస్తున్నా.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
‘ఏకీకృతానికి’ ఎన్ని రోజులు?
పంచాయతీరాజ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకే విధమైన సర్వీసు నిబంధనలు వర్తించే ఏకీకృత సర్వీస్‌ నిబంధనల సమస్య 1998 నుంచి చిక్కు వీడలేదు. ఇది పరిష్కారం కాకపోవడంతో పర్యవేక్షణ అధికారులు లేక పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాస్తవానికి ప్రభుత్వాలు ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే న్యాయస్థానాల్లో ఎప్పుడో తీర్పువెలువడేదని నిపుణులు చెబుతున్నారు.


పదోన్నతులేవీ?

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఆరేళ్లు గడుస్తున్నా మళ్లీ ప్రమోషన్లు లేవు. గత ఏడాది అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చినా.. పాఠశాల విద్యా శాఖలో మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. యాజమాన్యాలవారీగా పదోన్నతులు ఇస్తామని గత మార్చిలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయినా, ఇప్పటివరకు అది నెరవేరలేదు.
ఏకీకృత సర్వీస్‌ నిబంధనల సమస్య పరిష్కారం కాకున్నా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ)లకు స్కూల్‌ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా, ఎస్‌ఏలకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించవచ్చు. అలా దాదాపు 2 వేల మంది ప్రధానోపాధ్యాయులు, 7,500 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. అయినా, ఆ దిశగా చర్యలు లేవు. దీంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తలెత్తుతోంది.


భాషా పండితుల ఎదురుచూపులు  

రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే గ్రేడ్‌-2 భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్ల హోదా కల్పిస్తామని ప్రభుత్వం 2017లో జీఓలు జారీ చేసింది. ఆ తర్వాత 2019లో మళ్లీ కొన్ని పోస్టులు కలిపి జీఓలు ఇచ్చింది. దానిపై న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మళ్లీ గత ఫిబ్రవరిలో నిబంధనలను సవరించి జీఓ 2, 3లు జారీ చేసింది. అయినా, ఇప్పటివరకు వారికి హోదా దక్కలేదు. ఆ హోదా కోసం దాదాపు 10,446 మంది ఎదురుచూస్తున్నారు.


ఆరేళ్లు గడిచినా ‘ఆదర్శం’ అంతంతమాత్రం

ఆంగ్ల మాధ్యమ విద్యనందించే మోడల్‌(ఆదర్శ) పాఠశాలలు 2013లో ఏర్పాటయ్యాయి. వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఏడాది క్రితం వరకు సర్వీస్‌ నిబంధనలే లేవు. ఎనిమిదేళ్లు అవుతున్నా పదోన్నతులు, బదిలీలు లేవు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వర్తించడం లేదు. ఆరోగ్య కార్డులు లేవు. మళ్లీ నియామక ప్రకటనా రాలేదు. 88 ప్రిన్సిపాళ్లు, 477 పీజీటీ, 985 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


భార్యాభర్తలు ఒక చోటుకు చేరేదెప్పుడు?

ఉపాధ్యాయ భార్యాభర్తలను ఒకచోటుకు తీసుకురావాలని 2018 మే 16న టీచర్ల సంఘాలతో జరిగిన సమావేశంలో సీఎం స్పష్టంచేశారు. 2014లో దానిపై జీఓ 182 ఇచ్చినా.. బదిలీలు చేయకపోవడం విద్యాశాఖ వైఫల్యంగా సీఎం వ్యాఖ్యానించారు. అయినా, ఇప్పటివరకు అతీగతీ లేదు. దాదాపు 700 మంది ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.


సంక్షోభంలో పాఠశాల విద్యారంగం
-చావ రవి, కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్‌

ఏకీకృత సర్వీస్‌ నిబంధనలు, జోనల్‌ మార్పు తదితర వాటి కారణంగా ఇప్పటి వరకు పదోన్నతులు ఇవ్వలేదు. గత మార్చిలో పాత జిల్లాల వారీగా పదోన్నతులు ఇస్తామని చెప్పి తీరా జోనల్‌పై స్పష్టత వచ్చాక మళ్లీ కొత్త జిల్లాలవారీగా అని ప్రభుత్వం చెబుతోంది. అదే జరిగితే మళ్లీ నెలల తరబడి జాప్యం ఖాయం. అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చి ఉపాధ్యాయులకు మాత్రమే ఆపారు. రాష్ట్ర విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయింది.


సమాజ సమస్యగా చూడాలి
- కటకం రమేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌టీఎఫ్‌

ఉపాధ్యాయుల సమస్యలన్నీ ఆర్థికంతో ముడిపడినవి కావు. పదోన్నతులు ఇస్తే సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుంది. బడులకు ప్రధానోపాధ్యాయులు వచ్చి పర్యవేక్షణ పెరుగుతుంది. దానివల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. దీన్ని సమాజ సమస్యగా చూడాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని