విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది.

Updated : 07 Feb 2023 05:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల తర్వాత మరోసారి సిబ్బంది వేతనాలకు బ్లాక్‌గ్రాంట్‌తో పాటు హాస్టళ్లు, ఇతర సౌకర్యాలను మెరుగు పరిచేందుకు నిధులు ఇవ్వనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2017-18లో ఎనిమిది విశ్వవిద్యాలయాలకు రూ.420 కోట్లు, 2018-19లో రూ.210 కోట్లు కేటాయించింది. అందులో విడుదల చేసింది మాత్రం సగానికి మించలేదు. ఈసారి వర్సిటీల్లో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరాన్ని పలువురు ఉపకులపతులు విద్య, ఆర్థికశాఖ మంత్రులు, అధికారులకు వివరించారు. ఈక్రమంలోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. గతంలో మాదిరిగా వర్సిటీల వారీగా అభివృద్ధి నిధుల కేటాయింపును బడ్జెట్‌లో పేర్కొనలేదు. జేఎన్‌టీయూహెచ్‌ తమకు ఒక్కరికే రూ.500 కోట్లు కావాలని నిధులు కావాలని ప్రతిపాదించింది.  ఓయూ, కాకతీయ కూడా రూ.200 కోట్ల చొప్పున కోరాయి. చివరకు అన్ని వర్సిటీలకు రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గత బడ్జెట్‌లోనే కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా ఉన్నతీకరిస్తామని, అందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిన సర్కారు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజా బడ్జెట్‌లో మళ్లీ రూ.100 కోట్లు కేటాయిన్నట్లు ప్రకటించింది.

* మహబూబాబాద్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్ది రోజుల క్రితం ఆ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. బడ్జెట్‌ ప్రసంగంలో మాత్రం మంత్రి హరీశ్‌రావు మహబూబ్‌నగర్‌లో కొత్తగా కళాశాల ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ప్రసంగ పాఠంలో కూడా మహబూబ్‌నగర్‌ అనే ముద్రించారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుచేసేది మహబూబాబాద్‌లోనేనని స్పష్టంచేస్తున్నారు. బడ్జెట్‌లో పేర్కొనకపోయినా ఖమ్మంలో కూడా కళాశాల ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

విద్యారంగ బడ్జెట్‌పై సంఘాల అసంతృప్తి

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సంతృప్తికరంగా లేవని పలు ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేవలం 6.57 శాతం నిధులే ఇచ్చారని పేర్కొన్నాయి. ఈమేరకు టీఎస్‌యూటీఎఫ్‌, డీటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ తదితర సంఘాలు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ‘గత ఏడాది కంటే రూ.3 వేల కోట్లు అదనంగా కేటాయించినా.. ఏమాత్రం సరిపోవు’ అని టీఎస్‌యూటీఎఫ్‌ పేర్కొంది. గత బడ్జెట్‌లో మన ఊరు - మన బడి పథకానికి రూ.3,497.62 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఇంతవరకు 10 శాతం కూడా విడుదల చేయలేదని విమర్శించింది. మన ఊరు - మన బడికి ప్రత్యేక కేటాయింపులు లేవని డీటీఎఫ్‌ పేర్కొంది. ‘మన ఊరు - మన బడి పథకం పూర్తిస్థాయిలో అమలు కోసం ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో ఈ బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచింది’ అని టీపీటీఎఫ్‌ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని