సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దిగువన విద్యుత్‌ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.

Published : 20 Apr 2024 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దిగువన విద్యుత్‌ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ నెల 12వ తేదీన టెయిల్‌పాండ్‌లో నిల్వ ఉన్న ఏడు టీఎంసీలలో నాలుగు టీఎంసీలను దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు ఏపీ అధికారులు విడుదల చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం గరిష్ఠాలకు చేరినప్పుడు సాగర్‌ నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీటిని టెయిల్‌పాండ్‌కు తరలించి..తిరిగి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా  సాగర్‌లోకి ఎత్తిపోసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. సాగర్‌ నుంచి 21 కిలోమీటర్ల పొడువునా ఈ టెయిల్‌పాండ్‌ ఉండగా, దీని నిర్వహణను తెలంగాణ జెన్‌కో పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది సాగర్‌లో తగినంత నీటి నిల్వ లేకపోవడంతో జల విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టడం లేదు. ప్రస్తుతం టెయిల్‌పాండ్‌లో ఉన్న నీటిని ఏపీ తరలించుకోవడంపై జెన్‌కో అధికారుల నుంచి వివరాలు సేకరించిన నల్గొండ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు.. ఈ నెల 15న ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని