కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది.
వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పునరుద్ధరించని రవాణాశాఖ
1500 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రయత్నాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. నిర్వహణ వ్యయం ఎక్కువవుతోంది. వీటి నుంచి వచ్చే కాలుష్యమూ పెరుగుతోంది. పదిహేనేళ్ల జీవితకాలం దాటిన బస్సులను గ్రేటర్ హైదరాబాద్లో తిప్పేందుకు రవాణాశాఖ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు, సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యాజమాన్యం వీటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 1500 బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు అవన్నీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్లే అని తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యం
గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఆర్టీసీకి వచ్చిన ఆదాయానికి, అయిన ఖర్చుకు భారీగా అంతరం ఉంది. ఒకవైపు ప్రయాణికులు తగ్గడం.. మరోవైపు వేతనాలు, డీజిల్ వ్యయం పెరగడం.. దీర్ఘకాలం జరిగిన సమ్మె వంటి అంశాలతో నష్టాలు భారీగా పెరిగాయి. వాటిని పూడ్చుకునేందుకు యాజమాన్యం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో వేతనాలూ ఆలస్యమయ్యేవి. ప్రస్తుతం ఒకటో తేదీకే వస్తున్నాయి. అయితే అప్పులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్, సీసీఎస్ చెల్లింపుల రూపంలో రూ.వేల కోట్ల ఆర్థికభారం అలాగే ఉంది. ఈ స్థితిలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులు ప్రవేశపెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అద్దెకు తీసుకొని సర్దుబాటు
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలైనంత మేరకు అద్దె పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ తీసుకుంటోంది. జిల్లాల్లో ఒక్కో బస్సు రోజుకు 400-450 కి.మీ. తిరుగుతాయి. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యలతో సగటున 220 కి.మీ. మాత్రమే తిరిగే పరిస్థితులున్నాయి. జిల్లాల్లో 10, 12 లక్షల కి.మీ.కిపైగా తిరిగిన బస్సుల్ని హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. 15 లక్షల కి.మీ. దాటినవి కూడా తిరుగుతున్నట్లు సమాచారం. అయితే జీవితకాలం 15 సంవత్సరాలు దాటిన వాటికి రవాణాశాఖ ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరించట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ వీటిని పక్కనపెట్టాల్సి వస్తోంది. 2024 మార్చి వరకు ఇలా సుమారు 200 బస్సుల్ని ఆర్టీసీ పక్కన పెట్టింది. వీటిస్థానంలో సొంతంగా కొత్తవి కాకుండా అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంది. 2025 మార్చి వరకు దాదాపు 1300 బస్సుల జీవితకాలం పదిహేనేళ్లు దాటనుందని సమాచారం. ఈ నేపథ్యంలో వీటి స్థానంలో కొత్తవి కొనేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం బ్యాంకు రుణాలు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు