గోధుమ ధరలకు కళ్ళెం

దేశీయంగా గోధుమ ధరలను నియంత్రించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వాటి ఎగుమతులపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా వ్యాపారుల వద్ద ఉండే గోధుమ నిల్వలపైనా పరిమితులు విధించింది. కేంద్రం వద్ద ఉన్న నిల్వల్లో కొంతమేర బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాలనీ నిర్ణయించింది.

Updated : 19 Jun 2023 17:25 IST

దేశీయంగా గోధుమ ధరలను నియంత్రించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వాటి ఎగుమతులపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా వ్యాపారుల వద్ద ఉండే గోధుమ నిల్వలపైనా పరిమితులు విధించింది. కేంద్రం వద్ద ఉన్న నిల్వల్లో కొంతమేర బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాలనీ నిర్ణయించింది.

దేశీయంగా పెరుగుతున్న గోధుమ ధరలను నియంత్రించడానికి వ్యాపారులు, టోకువర్తకుల వద్ద ఉండే నిల్వలపై కేంద్రం తాజాగా పరిమితులు విధించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు దాకా ఈ ఆంక్షలు కొనసాగుతాయి. తన వద్ద ఉన్న నిల్వల్లో మొదటి దశలో 15 లక్షల టన్నుల గోధుమలను క్వింటా రూ.2150 చొప్పున బహిరంగ మార్కెట్లోకి విడుదల   చేయాలని కేంద్రం నిర్ణయించింది. బియ్యాన్నీ ఇలాగే బహిరంగ విపణిలో విక్రయించనుంది. ప్రస్తుతానికి నిల్వలు బాగానే ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల గత నెలలో గోధుమల ధరలు ఎనిమిది శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల తరవాత కేంద్రం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై ఆంక్షలు విధించింది.

ఉత్పాదకతలో వెనకంజ

కేంద్ర వ్యవసాయ శాఖ మూడో ముందస్తు అంచనా ప్రకారం 2022-23 పంట సంవత్సరంలో గోధుమల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 11.2 కోట్ల టన్నులు. వ్యాపారులు, రైతుల వద్దా నిల్వలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, రుతుపవనాల ఆలస్యం వల్ల ధరలు మరింత పెరగకుండా ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది. నిరుడు పంట దిగుబడులు తగ్గడంతో కేంద్రం గోధుమ ఎగుమతులపై నిషేధం తెచ్చింది. ఆ తరవాత గోధుమ పిండి ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం గోధుమలను పంపిణీ చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల గతేడాది గోధుమల సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గత రబీ సీజన్‌లో అంతకుముందు ఏడాది కంటే భారత్‌లో గోధుమల సాగు విస్తీర్ణం దాదాపు 15 లక్షల హెక్టార్లు పెరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో రైతులు వరి తగ్గించి గోధుమ సాగు చేపట్టారు. దాంతో ఉత్పత్తి పెరిగింది. భారత్‌లో వరి తరవాత రెండో ముఖ్యమైన ఆహార పంట గోధుమ. గోధుమ ఉత్పత్తిలో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలు ముందున్నాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు. ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో డ్రాగన్‌ దేశం వాటా దాదాపు 16శాతం. భారత్‌ది రెండో స్థానం (12.5శాతం వాటా). ఉత్పాదకతలో న్యూజిలాండ్‌, యూకే దేశాలు ముందున్నాయి. గోధుమ సాగు విస్తీర్ణంలో భారత్‌ అగ్రభాగాన ఉన్నా, ఉత్పాదకతలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా 32వ స్థానంలో నిలుస్తోంది. ప్రపంచ గోధుమ వ్యాపారంలో భారత్‌ వాటా ఒక శాతం కన్నా తక్కువే. ప్రధానంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, యూఏఈలకు ఇండియా ఎక్కువగా గోధుమలను ఎగుమతి చేస్తోంది. దేశీయంగానే గోధుమ వినియోగం ఎక్కువగా ఉంది. దాంతో ఎగుమతులు పరిమితంగానే ఉంటున్నాయి. స్వాతంత్య్రానంతరం భారత్‌ గోధుమలను దిగుమతి చేసుకొనేది. హరితవిప్లవం తరవాత ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి గోధుమ దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న గోధుమల్లో 70శాతం ఆహారం కోసం వినియోగిస్తున్నారు. 20శాతం పశువులకు వాడుతున్నారు. రెండు-మూడు శాతం పారిశ్రామిక రంగంలో ఉపయోగిస్తున్నారు. గోధుమ దిగుబడిలో వాతావరణ పరిస్థితులది కీలకపాత్ర. 2021-22 రబీ పంట కాలంలో అధిక ఉష్ణోగ్రతలవల్ల గోధుమ ఉత్పత్తి తగ్గిపోయింది. గత రబీ కాలంలో అకాల వర్షాలు పంట ఉత్పత్తిని దెబ్బతీశాయి. విస్తీర్ణం పెరగడంవల్లే 2022-23లో అంతకు ముందు ఏడాది కంటే 50 లక్షల టన్నుల ఉత్పత్తి అధికంగా వచ్చింది.

వాతావరణ మార్పులను తట్టుకొనేలా...

ప్రజల ఆహార భద్రత దృష్ట్యా ప్రభుత్వం వివిధ రకాల పంట ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను నిర్దేశిస్తోంది. ఇప్పటికే గోధుమలతోపాటు, చక్కెర ఎగుమతులపై నిషేధం కొనసాగుతోంది. ఇటీవల కందిపప్పు, మినుము నిల్వలపైనా కేంద్రం పరిమితులు విధించింది. తాజాగా గోధుమల నిల్వలపై ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ చర్యలతో కొంతమేరకే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు, నిల్వలపై ఆంక్షలతో అవసరం లేనంతగా ఆహార ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు తదితర పంటల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి. వాతావరణ మార్పులను తట్టుకొనేలా నూతన వంగడాలను అందుబాటులోకి తేవాలి. పంట సాగుకు ప్రోత్సాహకాలను అందించడంతో పాటు, సరైన మద్దతు ధరలను నిర్ణయించడమూ తప్పనిసరి.

దేవవరపు సతీష్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.