icon icon icon
icon icon icon

TDP-Janasena-BJP manifesto: ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది.

Updated : 30 Apr 2024 19:01 IST

అమరావతి: ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)లకు సంబంధించి కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో  దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు  తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు.

రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు.‘‘ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ తెలిపారు.

ఎన్డీయే హామీల్లో ముఖ్యాంశాలివే..

సూపర్‌ సిక్స్‌..

  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి
  • స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000
  • ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం
  • ప్రతి మహిళకి నెలకు రూ.1500 (19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు)
  • ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

సూపర్ సిక్స్ 2.0 / షణ్ముఖ వ్యూహం

  • ఇంటింటికీ రక్షిత తాగునీరు: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
  • పూర్ టు రిచ్ : పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్ షిప్ (24) పథకాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి ప్రజల నైపుణ్యతా స్థాయిని పెంచడం
  • సౌభాగ్యపథం : చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు
  • ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి
  • మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్
  • ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్ల ఏర్పాటు
  • అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టారు ప్రోత్సాహకాలు
  • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం
  • క్రీడలు: ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం
  • డిజిటల్ లైబ్రరీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీల స్థాపన NDA ప్రభుత్వం తెచ్చిన 10 శాతం EWS రిజర్వేషన్లను అమలు చేస్తాం. ప్రతి ఐదేళ్లకోసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం.

సామాజిక భద్రత పింఛన్లు పెంపు

  • రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపు (ఏప్రిల్ 2024 నుంచి అమలు)
  • దివ్యాంగుల పింఛన్ రూ.6,000 పెంచుతాం.
  • పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్
  • కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్

బీసీ డిక్లరేషన్

  • బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
  • బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్
  • చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
  • తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం
  • బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు
  • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తాం. రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పథకం పునరుద్ధరిస్తాం.
  • శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం
  • చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయంబర్స్ చేస్తాం. పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్
  • నాయీ బ్రాహ్మణులు: దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవ వేతనం. షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
  • గీత కార్మికులు : మద్యం షాపుల్లో 10% కేటాయింపు
  • వడ్డెర : క్వారీల్లో 15% రిజర్వేషన్.. రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు
  • రజక : దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ
  • మత్స్యకారులు:  సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20వేలు ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్‌కు ఆర్థిక సాయం. 
  • స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు

మహిళా సంక్షేమం

  • స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంపు
  • ప్రత్యేక పథకం ద్వారా పీ4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు
  • అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు
  • ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన
  • విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు.
  • పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరణ

ఉద్యోగులు, పింఛనుదారులు

  • సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం
  • ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు. అలవెన్స్ పేమెంట్స్ పైనా పున:పరిశీలన చేస్తాం. 
  • కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం
  • రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేస్తాం. పెన్షనర్స్‌ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు.
  • తక్కువ జీతాలు పొందే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు
  • వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
  • పాడి రైతులు: పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు- ఇన్సూరెన్స్ సౌకర్యం - గోకులాల ఏర్పాటు 
  • కాపు సంక్షేమం: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం.
  • కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం.

ఆర్యవైశ్య సంక్షేమం

  • ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తగు మేరకు నిధులు కేటాయింపు
  • చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల సౌలభ్యం
  • కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం

  • ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు. జిల్లాల వారీగా వర్గీకరణ చేపడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం. జీవో 3 పునరుద్ధరణ
  • ముస్లిం మైనార్టీల సంక్షేమం: విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు 
  • మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
  • ఇమామ్, మౌజన్లకు ప్రతినెలా రూ.10 వేలు; రూ.5 వేలు గౌరవ వేతనం; అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం 
  • మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం 
  • హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.1 లక్ష సాయం

క్షత్రియ సంక్షేమం

  • భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుగా నామకరణం
  • ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు
  • అగ్రవర్ణ పేదల సంక్షేమం: కమ్మ, రెడ్డి, వెలమ, ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారిత, అభివృద్ధికి చర్యలు చేపడతాం.
  • ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్స్‌సర్వీస్‌మెన్‌ సంక్షేమానికి కృషిచేస్తాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం
  • పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు:
  • గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం
  • ఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం

క్రిస్టియన్ల సంక్షేమం

  • క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు
  • చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం
  • స్మశాన వాటికలకు స్థల కేటాయింపు
  • జెరూసలేం యాత్రికులకు సాయం

వ్యవసాయం

  • 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా
  • రాయితీతో సోలార్ పంప్ సెట్లు మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు
  • సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందించడం
  • పంటల బీమా వర్తింపు, రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు / సంక్షేమ పథకాల అమలు
  • ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం (ZBNF) చేపట్టి వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు
  • ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి యూనిట్ల ఆధునీకీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు
  • దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ పటిష్టంగా అమలు
  • డ్రిప్ ఇరిగేషను 90% సబ్సిడీ
  • రాష్ట్రంలో సెరికల్చర్‌ను ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం

సాగునీటి రంగం

  • పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి
  • గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార- నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల త్వరితగతిన నిర్మాణానికి చర్యలు
  • రాష్ట్రంలోని నదుల అనుసంధానం-ప్రతి ఎకరాకు నీరు రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

కార్మికులు

  • రవాణా రంగం : డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు
  •  డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ
  • బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం
  • జీవో 21 రద్దు చేసి ఫైన్‌ల భారం తగ్గింపు, వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు
  • అసంఘటిత రంగ కార్మికులు: చంద్రన్న బీమా పునరుద్ధరణ. అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు
  • పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాం
  • మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు
  • అన్నా క్యాంటీన్ల ఏర్పాటు/డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం
  • రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం
  • ఫీజు రీయింబర్స్‌మెంట్: ఎయిడెడ్ కాలేజీలు, ప్రయివేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరిస్తాం
  • కాలేజీలకే రుసుం చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం
  • ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం: సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం.
  • చంద్రన్న బీమా పథకం: సహజ మరణానికి రూ.5 లక్షలు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం

 వైద్యం, ఆరోగ్యం

  • దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా
  • ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు
  • బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ

విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం

  • చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష

  • విద్య: కేజీ టు పీజీ సిలబస్‌ను రివ్యూ చేస్తాం
  • రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు. మూతపడిన పాఠశాలల పున:ప్రారంభం
  • డా॥ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
  • గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతాం. అవసరమైతే మరింత కఠిన చట్టాలు తీసుకొస్తాం.
  • ఆక్వా: అవసరం ఉన్న జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీలు. అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్ యూనిట్‌ రూ.1.50కే సరఫరా చేస్తాం. ట్రాన్స్ ఫార్మర్ల ధరలు తగ్గిస్తాం. ఏవియేటర్లు సబ్సిడీపై అందిస్తాం.
  • సమగ్రాభివృద్ధి: ఉజ్వల భవిష్యత్ పట్ల ఆశావహులు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరడానికి తగు అవకాశాలు కల్పించే సత్వర సమగ్ర ఆర్థిక అభివృద్ధికి పటిష్టమైన విధానాలను అమలుచేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేస్తాం.
  • విజన్ 2047 ప్రణాళిక ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి చేపడుతున్న పలు చర్యలను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా చర్యలు చేపడతాం

మౌలిక వసతుల కల్పన

  • గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం
  • సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తాం
  • పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మిస్తాం
  • వర్క్ ఫ్రం హెూమ్ కోసం ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో వర్క్ స్టేషన్ల రాటు ఏర్పాటు
  • ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు సరఫరా

ఉత్తరాంధ్ర అభివృద్ధి

  • విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తాం
  • వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు
  • విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం. అవసరమైన , అనువైన భూమిని వెంటనే కేటాయించి జోన్‌ను సాకారం చేస్తాం.
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి-వంశధార నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకీకరణ వంటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం
  • జీడిమామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు
  • కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం

  • నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తాం

పారిశ్రామికీకరణ, పెట్టుబడులు

  • గత ఐదేళ్లుగా విధ్వంసానికి గురైన బ్రాండ్ ఏపీని పునఃప్రతిష్టించి, భారీ స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు పెద్ద ఎత్తున ఊతమిస్తాం. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ కింద పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్ వంటి ఆధునిక, సాంకేతిక విజ్ఞానం వినియోగం ద్వారా తగు ప్రోత్సాహం
  • పర్యాటకం: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్, అడ్వెంచర్, హెరిటేజ్, ఈకో, టెంపుల్ మొదలగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు. ఉపాధి కల్పనకు ప్రోత్సాహం

దేవాలయాలు.. బ్రాహ్మణుల సంక్షేమం

  • హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు
  • ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమమ్ వేతనం ఉండేలా చేస్తాం
  • వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంపు
  • వార్షిక ఆదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
  • వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి
  • తిరుపతి / ఒంటిమిట్ట వంటి పుణ్య క్షేత్రాల పవిత్రతకి మూలధారాలైన వేయి కాళ్ల మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ 
  • దేవాలయాలకు పూర్తి రక్షణ- గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్షపడే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి శిక్ష పడేలా చేస్తాం
  • పురోహితులను, వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తాం
  • బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం
  • తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితోపాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్ అపాయింట్ చేస్తాం
  • బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం
  • వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు ‘యువగళం’ కింద రూ.3 వేల నిరుద్యోగభృతి

రాయలసీమ అభివృద్ధి

  • తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత
  • హార్టీకల్చర్ హబ్, విత్తన రాజధానిగా రాయలసీమ
  • కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు
  • కియా, ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతాం
  • చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను రాయలసీమలోని కీలక పట్టణాలకు అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్ తీర్చిదిద్దుతాం
  • యువగళం యాత్రలో ప్రకటించిన ‘మిషన్ రాయలసీమ’ అమలుకు చర్యలు
  • పంచాయతీరాజ్ డిక్లరేషన్: ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తాం
  • పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం కల్పిస్తాం- స్థానిక పాలనకు ఊతమిస్తాం
  • పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. ఐదేళ్లలో 10% వరకు పెంచుతాం.
  • సర్పంచ్ నుండి జెడ్పీ ఛైర్మన్ల వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని పెంచుతాం.
  • అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం
  • న్యాయవాదులు: న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఉచిత న్యాయ సేవల అందుబాటుకు లీగల్ కియోస్క్ స్థాపన, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు రూ.10 వేలు, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు
  • అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం
  • ఐదేళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను పునరుద్ధరిస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img