ఆవిరి కుడుములతో ఆరోగ్యం!

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తారు. అయితే కేవలం పండగ రోజునే కాదు.. నవరాత్రులూ పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే.

Published : 18 Sep 2023 11:34 IST

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తారు. అయితే కేవలం పండగ రోజునే కాదు.. నవరాత్రులూ పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మళ్లీ మోదకాలు తయారుచేసి గణపతికి నైవేద్యంగా సమర్పించే వారూ చాలామందే! అయితే ఎంతో అమోఘమైన రుచిని నింపుకొన్న ఈ ఆవిరి కుడుములు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. మరి, మోదక ప్రియుడికి నివేదన చేసే ఈ ఆవిరి కుడుముల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

కుడుములు.. ఎందుకు మంచివంటే?

సాధారణంగా ఆవిరి కుడుములంటే బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి.. వంటివి వాడతాం. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మోదకాలను తప్పకుండా తినాల్సిందేనట.

మోదకాల తయారీలో వాడే నెయ్యి పేగు శ్లేష్మ పొరను పునర్నిర్మిస్తుంది. తద్వారా పొట్టలోని విషపదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

కొబ్బరిలోని మీడియం చెయిన్ ట్రై-గ్లిజరైడ్స్ రక్తప్రసరణను అదుపులో ఉంచడంలో సహకరిస్తాయి. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది.

కొబ్బరిలోని ప్లాంట్ స్టెరాల్స్, స్టఫింగ్ కోసం ఉపయోగించే డ్రైఫ్రూట్స్.. వంటివి శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

బియ్యప్పిండి, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుముల్ని ఆవిరిపై ఉడికించి, నెయ్యిలో నంజుకొని తింటే ఆ రుచి అమోఘం. అయితే ఈ పదార్థాలన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి.. కాబట్టి పూర్తి సురక్షితం.

నెయ్యిలోని బ్యుటిరికామ్లం శరీర కణజాలాల్లోని వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాపును తగ్గించి ఆర్థ్రైటిస్ సమస్యను దూరం చేస్తుంది.

నెలసరికి ముందు మహిళల్లో ఆహారపు కోరికలు (పీఎంఎస్) ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. తద్వారా తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఈ కోరికల్ని తగ్గించడంలో బియ్యంలోని విటమిన్ ‘బి1’ సహకరిస్తుంది. అలాగే బియ్యప్పిండి రక్తంలోని చక్కెరను స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

వయసు పైబడిన ఛాయల్ని రూపుమాపి.. నవయవ్వనంగా కనిపించేందుకు, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ రుచికరమైన కుడుములకు సాటి మరొకటి లేదు.

వీటి తయారీకి వాడే పదార్థాలన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. అందువల్ల బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు.

మంచి కొవ్వులు, పోషక విలువల్ని నింపుకొన్న ఈ మోదకాలను వద్దనడానికి కారణమే లేదు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి.. దృఢత్వానికీ ఈ వంటకం చక్కగా ఉపయోగపడుతుంది- అంటున్నారు పోషకాహార నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్